పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

మఱచితే నీవు మన్నించి మమత మించి
పాయనట్లనె బ్రమయించి పంతగించి
యుల్ల మలర రమించి లోనూరడించి
కేవలారామపరివర్తి కృష్ణమూర్తి.

231


వ.

అని యివ్విధంబునం బలికిన గోపికల నూరడించి యుద్ధవుండు మరలి
చనుదెంచె నంత.

232


క.

సింధువు పొంగెనన జరా
సంధుఁడు పరిభూతసత్యసం[1]ధుఁడు వచ్చెన్
బంధురసింధురసైంధవ
బాంధవహితరథికవీరబలములతోడన్.

233


వ.

వచ్చి మథురఁ జుట్టుకొని యెదుర్కొన్న శౌరిం జూచి యిట్లనియె.

234

శ్రీకృష్ణుఁడు జరాసంధకాలయవనుల జయించుట

చ.

దరము వహించినట్టి నినుఁ దప్పక కాచితిఁ బొమ్ము పొమ్ము భీ
కరతరమైన నాదువిశిఖంబున కోర్వఁగ నీకు శక్యమే
నిరతము నీమనంబు నవనీతమయంబు రణంబు కొంచెమే
సురభులఁ గాయుటో మఱచి చొక్కిన కంసుని నేలఁ ద్రోయుటో.

235


సీ.

కరుణించి విడిచితిఁ గడకు నేఁగుము గూఢ
                       మైనభావంబు సొంపౌనె నాకు
మందరాగాధృతి నందంబు నొందెద
                       వొంటిగాఁడవు నట లూనఁదగునె
అడుగులోననె మించి తడఁబడఁ జేయుదు
                       పరశూరుఁ డన మించఁ బాటి యగునె
ఘనమహోదధివయోగర్వవర్ధనుఁడవు
                       నీ వహార్యస్ఫూర్తి నెరపినావు


తే. గీ.

సతులవ్రతములు జెఱిచితి జగము లెఱుఁగ
మ్లేచ్ఛకోటి నెదిర్చినమేర నిచట
పూని నిల్చెదు విక్రమస్పూర్తి మెఱసి
తవిలి మముఁ బోరఁ గెలువ నీతరమె కృష్ణ.

236
  1. సంధ్యుండు (పా)