పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

కువలయాపీడమౌ కువలయాపీడంబు
                       మావంతుఁ డత్యంతమత్సరమున
మావంతుఁ డప్పుడు మట్టింపఁ బూనిన
                       దంతంబు పెఱికి తద్దంత ముగ్ర
శక్తి గావించి యాశౌరి చాణూరము
                       ష్టికుల ముష్టిహతి సంస్థితులఁ జేసి
దరము పెంపున నిజోదరము భంగము నొందఁ
                       గంసుఁ డుగ్రారిచిక్రింసుఁ డగుచుఁ
దమకమున నుండఁ బడఁద్రోచి తగ జయించి
తల్లిదండ్రులఁ బూజించి ధన్యుఁ డైన
యుగ్రసేనునిఁ బాదాగ్రయుగ్రసేనుఁ
జేసి పట్టంబు గట్టె నూర్జితము గాగ.

220


వ.

అంత నాకృష్ణుండు సాందీపునియొద్ద సకలవిద్యాప్రవీణుండై గురు
దక్షిణ యొసంగెదనని విన్నవించినఁ దద్దేశికుండు ప్రభాసతీర్థంబున
మునింగిపోయిన పుత్రులం దిరుగం దెచ్చిన నదియ నాకు దక్షిణ యని
ప్రార్థించిన.

221


క.

పంచజనాకృతి గల హరి
పంచజనాఖ్యదైత్యు భంజించి విమ
ర్శించి కయికొనియెఁ గరమునఁ
జంచద్రుచి మించు పాంచజన్యమునంతన్.

222


వ.

బాణాసనశరఖడ్గాదిసాధనవిచిత్రంబైన యరదం బెక్కి కమలనాభుం
డతిరయంబున సంయమనీపురంబు చేరి బ్రహ్మాండంబు పగులునట్లుగాఁ
బాంచజన్యంబు పూరించిన.

223


క.

దండధరుఁ డంతఁ గని యు
ద్దండధరోద్ధరణ బాహుదండునకు ముహు
ర్ధండానతి సేయుచు బ్ర
హ్మాండానతి దృశ్యమహిమ యపుడు నుతించెన్.

224


వ.

నుతియించి వైవస్వతుం డొసంగినం గురుపుత్రుల నాహరి
గురువున కిచ్చి.

225