పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

మన సెఱిఁగి వయ సెఱిఁగి పొ
ల్చినచూపు లెఱింగి వలపుసిరు లెఱిఁగి వధూ
జనములతోడన్ బృందా
వనవంజులకుంజపుంజవసతుల మెలఁగెన్.

164


వ.

ఇట్లు మెలఁగుచు ననేకదినంబులు విహరించి కృష్ణుండు గోపికల రతులఁ
గరఁగించి యొక్కనాఁడు తిరోహితుండైన.

165


క.

కులిశాంకుశవజ్రధ్వజ
జలజధనుశ్చక్రకూర్మచామరరేఖల్
గల యడుగులచొ ప్పరయుచుఁ
గలకంఠులు వెదకి రపుడు కంజదళాక్షున్.

166


శా.

హా వేణుస్వరమాధురీసరణు లాహా మౌళిపింఛాంక మౌ
రా వేదాంతశిఖావతంసపదసౌరభ్యం బయారే దయా
శ్రీవాల్లభ్యమహోమహిమ లాశ్రీకృష్ణకల్పద్రుమం
బేవేళన్ ఫలియించునో మనలతో నేమేమి భాషించునో.

167


వ.

అని.

168


తే. గీ.

తరులతాకుంజఖగమృగతతుల నడిగి
గగనభూవారిపవన[1]తేజోంతరముల
నడిగి వేదశిఖాగమ్యమైనయట్టి
బ్రహ్మముఁ దలంచి కానక పద్మముఖులు.

169


వ.

మోహసంతాపంబులం బొరలుచునున్న యప్పుడు సౌలభ్యసౌశీల్యాద్య
నంతకల్యాణగుణపూర్ణుండైన కృష్ణుండు కరుణాయత్తచిత్తుండై
యాగోపికలకుఁ బ్రత్యక్షంబై నిలిచి.

170


ఆ. వె.

మ్రొక్కి కౌఁగిలించి ముద్దాడి పైఁబడి
తియ్యమోవిజాలుతేనె యిచ్చి
పొదలఁ బొదల ప్రేమఁ బొదలిన కాంతల
నందఱను రమించి యాదరించె.

171
  1. యతి చింత్యము