పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9

అందుచేతఁ గృష్ణాజిల్లా విజయవాడ తాలూకా వల్లూరిపాలెము వాస్తవ్యులు, భక్తవరులు, వీరశైవులు శ్రీ చలవాది రాచయ్యగారు విశేషముగఁ బరిశ్రమించి చేకూర్చిన విరాళములతో నీగ్రంథమును నేనే యిప్పు డిట్లు చేతనైనంతవఱకుఁ బరిష్కరించి ప్రకటించితిని. అనుభవసారమునకు దీనికిఁ గూడఁ బరిశుద్ధమయిన వ్రాతప్రతు లెవరియొద్దనైన నున్నచో దయతో వానిని బంపిన యెడల వానినిగూడఁ బరిశోధించి భావిముద్రణమున నింతికంటెఁ బరిశుద్ధముగ వెలువరింపనవునని మనవి చేయుచున్నాను. పూర్వముద్రణములోఁ బలుతావుల ఛందోభంగములుకూడఁ గాననగును. "ఛందోభంగం నకారయేత్" యని శాస్త్రకారులశాసనము. కావునఁ గవిహృదయము, పద్యార్థము సరిగా గ్రహింపరానితావుల నర్థముమాట యెట్లున్నను ఛందోభంగ మయినను గలుగకుండునట్లు నేను స్వతంత్రముగఁ గొన్నిసంస్కరణములు గావింపవలసి వచ్చినది. గ్రంథవిస్తరభీతిచే వాని నిట వివరింపనైతిని. ఈ గ్రంథముద్రణమునకు సహకరించిన మహనీయులకుఁ బ్రోత్సాహకులు శ్రీ చలవాది రాచయ్య, రాచంశెట్టి బసవనాగయ్యగారలకుఁ బరమేశ్వరుఁ డాయురారోగ్యాభ్యుదయములఁ బ్రసాదించుఁ గావుత మని ప్రార్థించుచున్నాఁడను. సోమనాథుని లఘుకృతులనన్నిటిని గలిపి యొకసంపుటముగాఁ బ్రకటించుటకుఁ గూడ శ్రీ రాచయ్యగా రుద్యమించినారు. భక్తులు భాషాభిమానులు వారికి సర్వవిధములఁ దోడ్పడెదరుగాక !

ఈగ్రంథపరిష్కరణమున నాతోపాటు శ్రమించియు, ప్రూపులఁ జూచుటలో నతిశ్రద్ధ వహించియు మిత్రులు, శ్రీపతిముద్రణాలయాధికారులు, విద్యావినయసంపన్నులు, శ్రీ తోకల బుచ్చిరాజుగారు నాకు మిక్కిలి తోడ్పడిన సౌజన్యమునకు నాకృతజ్ఞతాభివందనముల నర్పించుచున్నాను. పరమేశ్వరుఁడు వారి కన్నివిధముల శుభంకరుఁ డగుఁగావుత మని యభిలషింతును.

ఇట్లు

కాకినాడ,

భక్తజనవిధేయుఁడు,

28-1-62

బండారు తమ్మయ్య

————