పుట:కాశీమజిలీకథలు -01.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

241

భూపాలుండును కాలయాపన సైపక యాపడఁతిచేఁతనున్న విపంచియూడఁబెరికి మోహముతో గందర్పక్రీడారతుండై యవ్వేదండగమనను సంతోషపారావారవీచికల నుయ్యెల లూగించెను.

ఈరీతిఁ గ్రీడించుచుండ వారికారాత్రి యొకగడియలాగైనను వెళ్ళలేదు. వారి వలపు లేమని చెప్పుదును. విష్ణుచిత్త కామత్తకాశిని పరకీయయని యూహించుటచే నంతవలపు గలిగినది. స్వీయ యనితెలిసినచో నట్లుండడుసుమీ? అదియంతయుఁ బ్రచ్ఛన్నముగాఁ జూచుచున్న మంత్రిమిగుల సంతసించెను. తెల్లవారినంత రాజు మంత్రియొద్దకువచ్చి రాత్రిజరిగిన చర్యయంతయుఁ జెప్పి యప్పడంతి చక్కఁదనమును గుఱించియు మక్కువను గుఱించియుఁ బెక్కు తెరంగుల స్తుతిఁ జేయదొడంగెను. అంతనా విష్ణుచిత్తుఁడు మంత్రియనుమతిఁగొన్ని దినములందుండి యాచేడియతో రాత్రింబవ ళ్ళేకరీతిఁ గామక్రీడలం దేలుచుండెను. ఒక్క నాడతని రెండవభార్య పతిజాడ తెలియక యతని వెదుకుటకై పరిచారకుల నంపెను. వారు నెట్టకేలకు రాజున్న తావుదెలిసికొని యతనితో దేవిగారి విజ్ఞాపనము దెలియంజేసిరి.

రాజు సుశీలతో నావార్తఁజెప్పి తనకుఁ బురంబునకరుగ ననుజ్ఞయిమ్మని వేడుకొనెను. సుశీలయు నతనిమరల శీఘ్రముగావచ్చు. నట్లొడంబడఁజేసి యానవాలుగా నతని యుంగరము గైకొని యతని పయనంబున కనుమతించినది.

విష్ణుచిత్తుఁడు నెట్టకేల కారాచపట్టిని విడచి పురంబున కరిగి యందు నిజదర్శనాయత్తచిత్తయైయున్న దేవయానకు సంతోషము గలుగజేసెను.

అచ్చట సుశీలయు గర్భవతియై పదియవమాసంబున నధికరూపసంపన్నుఁడు పరాక్రమశాలియును నత్యంత బుద్ధిమంతుండునునగు పుత్రునింగనియె. ఆవర్తమానము గూఢచారులవలస విని దీర్ఘదర్శి రహస్యముగా నాబాలునకు జాతకర్మాదివిధుల నిర్వర్తించి కామపాలుండని పేరుపెట్టెను. ఆబాలుండును శుక్లపక్షక్షపాకరుండు బోలె దినదినప్రవర్ధమానుండై యధికతేజస్సమంచితుండై యొప్పుచుండె. వాని కైదేఁడులు వచ్చినంత మంత్రియు నంతియప్రాయముననున్న బుద్దిసాగరుడను సార్ధకనామంబు గల తనకుమారునిఁ గామపాలునితో జోడుజేసి యొక గురువునొద్దఁ జదువనేసెను.

సుశీల రూపప్రాయతేజోమనీషావిశేషంబుల నొండొరుల కించుకయేని వాసి లేని యాబాలురిరువును సకలలోకమనోహరులై పదియారేఁడులు ప్రాయము లోపుననే సకలవిద్యలు సభ్యసించి విలువిద్య యందును నసమానపాండిత్యము గలవారైరి. వారు విద్యాభ్యాసము చేయునప్పుడు గొన్నిదినములు మంత్రియింటను కొన్ని దినములు సుశీలయింటను నివసించి క్రీడగాగడిపిరి. ఇంచుకయేని శ్రమముగాఁ దలంపలేదు.