పుట:కాశీమజిలీకథలు -01.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమశర్మ కథ

225

పక్షులను మృగములను భక్షింపఁ దొడంగెను. దానికి భయపడి గ్రామస్థులెల్లరు వచ్చి రాజుతో మొరబెట్టుకొనిరి.

అప్పుడు రాజు మంత్రితో నాసింహమును వధించు యోధుల నియమింపుమని చెప్పెను. మంత్రియు సోమశర్మయందుఁగల క్రౌర్యమును దీర్చుకొన సమయము వచ్చినదిగదా! యని యూహించి యతనితో నిట్లనియె. మనయొద్ద సేన తక్కువగా నున్నది. బలము గలిగిన యోధులను తగ్గించిరి. సాధారణుండుండినను నేమి ప్రయోజనము. ఇంతకు మన వైదికబ్రాహ్మణుఁడే సమర్థుడు బలశాలి. అతనినే నియోగింపుడని చెప్పిన నామాటలు విని రాజు అప్పుడే సోమశర్మను బిలిపించి పంచాననమును వధింపుమని యాజ్ఞాపించెను.

సోమశర్మయు నతనియాజ్ఞ శిరంబునంబూని వీరాలాపములు పలుకుచు గొంచ మైనను జంకులేక తన్ను దైవమే రక్షించునను ధైర్యముతో నింటికరిగి పెందలకడ భోజనముచేసి పూర్వము దొంగల కత్తులు తనయింటనే దాచియుంచెను. కావున నా కత్తు దిరువదినాలుగును కట్టకట్టి యురిబైటికిఁ దీసికొనిపోయి క్రమంబున నవియన్నియు నాప్రాంతమందున్న యొక్క పెద్దతాళవృక్షముపైకి జేర్చెను. అతఁడు ఆ త్రాటిచెట్టు చిట్టచివరఁ గూర్చుండి సింహము రాక కెదురు చూచుచున్నంత రాత్రి నాహర్యక్ష మక్షీణజవంబులో వచ్చి బొబ్బలిడుచు నోరు తెరచుచుఁ దోకయాడించుచుఁ గనఁబడిన జీవమునెల్ల భక్షింపుచు గంతులు వైచుచుండ జెట్టుమీఁదనుండి సోమశర్మ దాసిముండా యిటురమ్మని పెద్ద కేకలువైచెను.

ఆధ్వని జాడఁబట్టివచ్చి యాకేసరి తాటిచెట్టునిట్టట్టు కదలరాయుచు నోరు దెరచుకొని యహంకారముతో బై కెగర జొచ్చెను. అప్పుడు సోమశర్మ యది నోరు దెరచి యెగిరినప్పుడెల్ల నొక్కకత్తి దాని నోటిలోనికి జారవిడుచుచుండెను. అదియుఁ గోపముతో నాతడు విడిచిన కత్తులన్నియు గ్రమంబున మ్రింగివైచెను. దానంజేసి కడుపులోనున్న ప్రేగులన్నియు దెగి నెలవుల రక్తంబుగార యూపిరివిడువ దెరిపి లేక కొంచెముసేపులోనే తన్నుకొనుచు నేలంబడి చచ్చెను. దానిచావు చాలసేపు నిదానించిచూచి బాగుగ నమ్మకము దోచిన వెనుక సోమశర్మ చెట్టుదిగి యొకకత్తి చేత దాని యవయవములన్నియు ముక్కలుక్రింద నరికి రాసిగాజేసి దాని రక్తమంతయు మొగమునకు శరీరమునకుఁ బూసికొని భయంకరాకారముతో నారాశిచుట్టును గత్తిబూని దిరుగుచుండెను.