పుట:కాశీమజిలీకథలు -01.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఇంతలో దెల్లవారుటచే జనులందరువచ్చి చచ్చిన సింగము నంగములుజూచి సోమశర్మ పరాక్రమమునుఁ వేతెఱంగుల వినుతించుచుఁ గొందరుపోయి రాజుగారితోఁ జెప్పగా నారేఁడు సకలసామంతమంత్రిపౌరపరివార సహితముగా సోమశర్మ యున్న తావునకు వచ్చి చచ్చియున్న సింహమునుజాచి మిగుల నాశ్చర్యమందుచు సంభ్రమముజెంది యతనిం గౌఁగలించుకొని యత్యాదరముతో నిట్లనియె.

ఆర్యా! నీభుజపరాక్రమ మమానుషమై యున్నది. అసహాయశూరుండవనిన నిన్నే యనవలయును. నీవు చేసినపని నాకెంతయు సంతసము గూర్చుచున్నది. నీ యభీష్టమెద్దియో తెలుపుము. ఇప్పుడే యిచ్చెదనని పలికిన సంతసించి సోమశర్మ యిట్లనియె. రాజా నీకు నష్టమైన కోరికలు నేనేమియు గోరను. ఇప్పుడు మన సంస్థానములో నూరక జీతములు తినుచుఁ బనిబాటలులేక తెగబలిసి నాలుగు లక్షల సైన్యమున్నది. వానిలో రెండు లక్షలపౌజులు తగ్గించి యాజీతములు నాకే యియ్యవలయును. ఇదియే నాకోరిక అని యడిగిన నారాజు మంత్రి యెన్ని విధముల వలదని చెప్పినను వినక యప్పుడే యాసేనను తగ్గించి యాజీతములు సోమశర్మకు నిచ్చు నట్లు నియమించెను.

సోమశర్మయు, నాసింహపుచర్మమును కత్తులను నొకపెట్టెలోఁ బెట్టి రహస్యముగాఁ దనయింటఁ దాచియుంచెను. సోమశర్మపై మునుపటికంటె రాజుగారికెక్కువ ప్రీతిగలిగియుండెను. సర్వకార్యములతని మీఁదుగనే నడపుచుండెను. మంత్రి మొదలగు నుద్యోగస్థులకు నతనియందు మఱియు నీర్ష్యప్రబలియు చుండెను.

భూరిశ్రవునిచేఁ దగ్గింపఁబడిన రెండులక్షల సేనయు నీరాజునం దసూయజెంది యతనికిఁ శత్రుఁడైన రాజునాశ్రయించెను. దానంజేసి యారాజు తనకు మునుపున్న యారులక్షల సైన్యము నిప్పుడు రెండుసారులు చేరి నాలుగు లక్షల సైన్యముగలసి పదిలక్షల సేనగలవాఁడై యుండెను. అప్పుడు భూరిశ్రవునొద్దనుండి వచ్చిన నాలుగు లక్షల సేనలోనున్న సేనానాయకు లారాజుంజేరి యిట్లనిరి.

అయ్యా ! యిప్పుడు భూరిశ్రవుఁడు మిగుల బలహీనుఁడై యున్నవాఁడు. ఒక వైదికబ్రాహ్మణుని యాలొచనమువిని సేననంతయుఁ తగ్గించినాఁడు. ఇప్పుడు తమయొద్ద పదిలక్షల సేన యున్నది. అతనికి రెండు లక్షల సైన్యము మాత్రమే యున్నది. మన మిప్పుడతనితో యుద్ధముజేసి సులభముగా జయింపవచ్చును. అని యతనిగుట్టంతయుం జెప్పి యతనిమీదఁ యుద్ధమునకుఁ బోవుటకై యారాజును ప్రోత్సాహపరచిరి.