పుట:కాశీమజిలీకథలు -01.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రాజా! యీ యడుగులప్రక్కను పడతి యడుగులుగూడ గనంబడుచున్నవి. చూచితివా? వీరి చిహ్నములు చూడ నైశ్వర్యము గలవారి పాదచిహ్నమువలెఁ గనఁబడవు. శ్రమపడి నడచునట్లు తోచుచున్నది. అయినను పోయిచూతము పదుఁడని పలికిన యిద్దరును వేగముగా నడచిరి. ఆ యడుగుజూడంబట్టి పోవఁబోవ నొక పల్లెటూరు గనంబడినది. ఆ యూరిలో నొక యరుగుమీద నాయడుగులవారు పండుకొనియుండిరి. వా రొకబ్రాహ్మణదంపతులు. మిగుల దరిద్రులు. వారిం జూచి విక్రమార్కుండును భట్టియు మిగుల వెరగుపడుచు నా బ్రాహ్మణుని లేపి అయ్యా! తమ కాపుర మేయూరు? ఇచ్చట కేమిటికి వచ్చితిరి? మీ స్థితిగతు లెట్టివని యడిగిరి.

ఆ బ్రాహ్మణుఁడు లేచి వారితో మిట్లనియే ఆయ్యా! మాది రాయవరము. నేను బ్రాహ్మణుఁడను. ఈ చిన్నది నా భార్య. బాల్యంబుననే దీని నాకుఁ బెండ్లి జేసిరి. నాకు జ్ఞానము వచ్చినది మొదలు దరిద్రమే బాధింపుచున్నది. ఎన్ని యుపాయములచేత నైనను నింటియొద్ద జీవనోపాధి కుదిరినదికాదు. ఎందైన నుదరపోషణమగునేమోయని భార్యతో నిల్లువిడిచి యిట్లువచ్చితిని. మీరు మిగుల మంచివారిగ గనిపించుచున్నారు. మాకు మిగుల నాకలిగానున్నది. ఈపూటకింత భోజనసదుపాయము చేయుదురా? యని యడిగెను. అప్పుడు భట్టియు విక్రమార్కుండును నతని దరిద్రమునకు భార్యయేగదా! హేతువని యూహించి యామె యవలక్షణము లన్నియు బరీక్షించి యందలి యథార్థము దెలియఁగోరి యతని కిట్లనియె.

బ్రాహ్మణుఁడా! యెంత దరిద్రము వచ్చినను నాడుదాని నిల్లు గదుపుదురా? పాపము ఈ చిన్నది మీతో మార్గక్లేశ మనుభవింపుచుఁ దిరుగుచుండెనే! కటకటా! ఆమె మొగమెట్లు వాడిపోయినదో చూడుడు ఇప్పుడైనను మేము చెప్పునట్టు చేయుము. ఆమె భోజనము నిమిత్తము కొంత సొమ్మిత్తుము. దానితో నీబిడ నింటికి బంపుము. నీవు మాతో రమ్ము. నీకు యెద్దియేని వ్యాపారమున ధనము కొరకు నుపాయము చూపింతుమనుటయు నతం డందులకు సంతసించుచు వారికిట్లనియె. అయ్యలారా! మీరు పుణ్యాత్ములు, ఇంటివద్ద నెట్లును గడవమి దీని వెంటబెట్టుకొని త్రిప్పుచుంటిని.ఇంటియొద్ద దిక్కెవ్వరును లేరు. దీని కెద్దియేని యాధారము చూపించినచో నింటికనిపెదను. నేను మీతో వచ్చి మీరు చెప్పిన పనిని జేయుదు. అట్లనుగ్రహింపుఁడని వేడుకొనుటయు వారు అందులకు మీభార్య కిష్టమున్నదియో లేదో యడుగుమనిన నతండా మాట చెప్పిన నాబిడ సంతోషముతోనే యెప్పుకొనెను. విక్రమార్కుండు భట్టియు నా బ్రాహ్మణుని భార్యకుఁ గోరినంత ధనమిచ్చి యిచ్చవచ్చినచోటునకుఁ బొమ్మని చెప్పి యతనిఁ దనవెంటఁ దీసికొని యుజ్జయినీపురమున కరిగిరి.

అందు వారా బ్రాహ్మణునికి వేరొక్క చక్కని కన్యకం బెండ్లిచేసి యాచిన్నది కాపురమునకు వచ్చినతోడనే మున్ను తాముంచిన నగలన్నియు మరల బుచ్చుకొని