పుట:కాశీమజిలీకథలు -01.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమంజరి కథ

197

ఇప్పుడు నాకత్యంతప్రాణమిత్రుడును పుత్రతుల్యుఁడగు రాజపుత్రుని నీయొద్ద కనిపితిని. వీనికి మన యింటనున్న వింతలన్నియుఁ జూపించి మనగుట్టంతయు నెరుఁగజెప్పుము. వీఁడు నిత్యము నాకుఁ జాలసహాయము చేయుచున్నాఁడు. వీఁడు సంతసించునటుల విందులుచేసి యంపవలయును. నీక్షేమ మరయుటకే వీని నీయొద్ద కనిపితిని. విశేషములు లేవు. కంకాళివ్రాలు అని యాజాణ దాని లిపి పోలికగానే వ్రాసినది.

అట్లు వ్రాసి యాయుత్తరము మునుపటి సంచిలోనే యమర్చి తెలియనట్లు అంటించి మరల నతని జేబులో వైచినది.

మునుపటి యుత్తరము తనయొద్దనే దాచియుంచెను. ఇంతలో నతనికి మెలకువ వచ్చినది. కన్నులు నులిమికొనుచు లేచి యతం డామెతో తరుణీ! నేను పండుకొని చాలాసేపైనది. లేపకపోతివేమి? పోవలసిన యగత్యమున్నదని నీతోఁ జెప్పలేదా? బాగుబాగని పలికిన యా కలికి నవ్వుచు నిట్లనియె. నాదా! యీవేళనే యరుగవలయునా! రేపు పోవచ్చును. మీ కార్యము తొందరయెట్టిదో నేనుగూడ వినియెదఁ గొంచెము దెలుపు డనవుఁడు సింహదమనుం డిట్లనియె

ప్రేయసీ! నా కథయంతయుం జెప్పుటకుఁ బెద్దతడవు పట్టును. క్రమ్మరవచ్చిన తరువాత నంతయుం జెప్పెద. నేను ద్వీపాంతరమున కరుగుచుంటిని. నాకు నేడుగురు తల్లులున్నారు. వారు సవతితల్లి మూలముగా నడవిలోఁ గన్నులుపోయి నిడుమలుబడుచున్నారు. మాతండ్రిపంపుననే నరుగుచుంటిని. నాకిచ్చట నిలువరాదని సంక్షేపముఁగా దనకథ చెప్పి యప్పడఁతికి నానవాలుగా నుంగరమొకటి యిచ్చి యెట్టకేలకు నామెచే ననిపించుకొని మరల నాగుఱ్ఱమెక్కి దక్షిణాముఖుండై యరిగెను. అట్లు చని చని, క్రమంబున నాకంకాళి చెప్పిన యానవాలు చొప్పున లవణసముద్రంబు దాటి శీఘ్రకాలమునే యాపర్వతశిఖరము చేరెను. అందున్న ఱాయి గురుతుపట్టి దానిపై నిలువఁబడి యగ్ని ప్రేల్చి చూర్ణము పొగవైచినతోడనే యారాయి పగిలి దారి యిచ్చినది. ఆ ద్వారముగుండ లోనికరిగిన విచిత్రభవన మొకటి కన్నులఁబడినది. అందనేక చిత్రవస్తువు లలకరింపఁబడి యున్నవి. మరియు ననేకమహారాజుల తలపుఱ్ఱెల మాలయొకటి గోడప్రక్కను వ్రేలఁగట్టబడి యున్నది. కంకాళి యీరీతినే పెక్కండ్ర రాజుల మోసముజేసి నలువది సంవత్సరములు కాగానే యతనిం జంపి యాపుఱ్ఱెఁ నామాలికలోఁ జేర్చుచుండును.

ఆతఁడు ఇంటిలోఁ బ్రవేశించినతోడనే మనుష్యవాసన గొట్టుటచేఁ బసికట్టి యారక్కసి మేల్కొని బ్రహ్మాండకరండంబు వగులనార్చుచు నతని మ్రింగరా నవ్వీరుండు జడియక కత్తి ఝళిపించుచు ముందుగ చేతనున్న యుత్తర మందిచ్చినంత బుచ్చుకొని యారక్కసి యది విప్పి జదువుకొని తటాలున నతనిం గౌఁగలించుకొని యిట్లనియె.

పట్టీ ! నీ వెవ్వరవో తెలియక నిన్నుఁ జంపఁ గమకించితిని. నిన్ను మాయక్క పెంచుకొని యెన్నిదినము లైనది? నీవు మా యక్కకుఁ జాల యుపకారములు జేసి