పుట:కాశీమజిలీకథలు -01.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణిమంజరి కథ

195

మణిమంజరి కథ

అన్నగరము మీఁదుగా నరుగునప్పుడు నన్నగరాధీశ్వరుని కూతురు మణిమంజరి యనునది సఖులతో సౌధోపరిభాగమున జల్లగాలి సేవింపుచుఁ గొలువుండ యాకాశమార్గమున నరుగుచున్న యా రాజకుమారునింగని తదీయరూపవిభ్రమవిలాసంబులు మనంబున కుల్లాసంబు గలుగఁజేయఁ దనయొద్దకు రమ్మని చేయి వీచినది. సింహదమనుఁడా సంజ్ఞను గ్రహించి యామేడకు దాపుగా నరుగుచుండ నల్లన నందు దిగెను.

అప్పు డదరిపడి యా చేడియ చెలికత్తెలతోఁగూడ తటాలున లేచి సుందరుఁడా! నీవు కంతుఁడవా? జయంతుఁడవా? వసంతుఁడవా? వీరిలో నొక్కరుఁడవు కానిచో నిట్టి సోయగముండునా? ఆకాశగమనమున నీవు మనుష్యుఁడవు కానియట్లు తెలియఁ బడుచున్నది. నీ వృత్తాంత మెఱింగించి నన్నుఁ గృతార్ధురాలిం గావింపుమని యడిగిన నతండు దాని కిట్లనియె.

అబలా! నాపేరు సింహదమనుండు. నేను నీవన్నవారిలో నొక్కరుఁడనుగాను. నేనొక రాజకుమారుండ. తండ్రిపంపున ద్వీపాంతరమున కరుగుచుంటిని. నాకు మిగుల దాహమగుచున్నది. తియ్యని పానకంబు ద్రావనిత్తువేని త్రావిపోయెద ననుటయు నచ్చతుర నవ్వుచు నిట్లనియె.

రాజపుత్రా! ఇచ్చట సుఖముగాఁ బానకము దొరకదు. అదియున్న తావు చెప్పెద వినుము. శ్రీకూర్మముమీఁదుగా నరిగిన మకరారంబు జూడనగును. దానిం దాటిన గదళీవనంబు బొడగట్టును. దానిం దాటిన కాంచీస్థానము, దానిపైన నొక హ్రదమున్నది. దాని పల్లమునుండి దాపుననున్న పైడిమెట్ల వెంబడి పై కెక్కినచో రెండు బంగారుకొండలు గనంబడు . వానిమీదఁ గొంచెముసేపు విశ్రమించి పైకిఁజన శంఖచూడుని వీడు జూడనగును. దానిఁ దాటినఁ జంద్రలోకం బాలోకోత్సవము జేయును. అందు వెదకినచో నమృతంపుబావి యున్నది. నీకు సమర్ధత గలిగియున్నచో నాబావిలో నమృతంబు ద్రావి దప్పిదీర్చుకొనుము, అని పలికిన విని యయ్యతివ చతురంబులగు వచనంబులకు మెచ్చుకొనుచు నా సుందరుండు మందహాసముచేసి యిట్లనియె.

చేడియా! నీవు చెప్పిన బావి పెక్కుచిక్కులు పడినంగాని లభింపదు. అచ్చటికి మేము స్వతంత్రముగాఁ బోవచ్చునా? అందుల కంకిలి లేదంటివేనిఁ బోయి త్రావెదను. అని పలుకుటయు నజ్జాణ యించుక సిగ్గుతో మఱియు నతని కిట్లనియె.

రాజహంసమా! అది మానసంబటిన వారికిఁగాని యంటరాదు. నీ వట్టివాఁడ వైనచో ద్రావుమనియె. ఇట్లొండొరులు సంభాషించుకొనుచుండ వారి యభిప్రాయములు తెలిసికొని చెంతనున్న చెలికత్తియలు ఎద్దియో మిషపన్ని మాటున కరిగిరి.