పుట:కాశీమజిలీకథలు -01.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

181

మఱియొకప్పు డప్పఁడతి మరల తండ్రిపేరుతో మే మెన్ని యుత్తరములు వ్రాసినను మీరు వచ్చుమాట వ్రాయరు. వివాహమై రెండుసంవత్సరములైనది. మమ్మునుఁ మిమ్మునుగూడ జనులు నిందించుచున్నారు. మీకు వచ్చుటకుఁ దీరికలేనిచో నచ్చటికి మా చిన్నదానినే యంపుచున్నాను. శుభముహూర్తమునఁ గార్యమును జరిగించుకొనుఁడు. ఈడువచ్చిన పడఁతి యత్తవారింటియొద్ద నుండఁదగినదికదా ? దీనికి మీ అభిప్రాయము వ్రాయుఁడు. అని యుత్తరము వ్రాసి యంపిన దానిం జూచి తిమ్మర్సు అమ్మానిని దీర్ఘక్రోధమునకు నాశ్చర్యపడుతు, మీరు వ్రాసిన విషయములకు సమ్మతించింతిమి. ఇచ్చటనే అన్ని కార్యములు జరిపించుకొనియెదము. శీఘ్రముగా నయ్యబల నిందుఁబంపుడని ప్రత్యుత్తరము వ్రాసి యంపెను.

దానిం జదువుకొని యవ్వనిత, తండ్రికావృత్తాంత మెఱింగించి యతఁ డెన్నివిధములచే, బోధించినను వినక కొంతసైన్యమును, దాసదాసీజనంబును వెంటబెట్టుకొని నిక్కముగా నత్తవారింటి కరిగు మెఱుఁగుబోఁడియుం బోలె బయలుదేరి కతిపయప్రయాణంబుల కృష్ణదేవరాయల నగరంబున కరిగెను. ఇంతలో దిమ్మర్సు బాల్యస్నేహితుండు, విచిత్రవస్తునిర్మాణదక్షుండునగు చిత్రకారునిం బిలిపించి యతనితో రాయలవంటి విగ్రహ మొకటి రచింపుమని యారీతి యంతయు బోధించిన, నాచిత్రకారుం డధికప్రయత్నముతో నట్టి విగ్రహ మొకటిచేసి యొకగదిలో మంచముమీఁదఁ బరుండబెట్టెను దానిఁజూచినవారు యథార్థముగాఁ కృష్ణదేవరాయలే నిద్దురపోవుచున్నవాఁడని యనుకొనమానరు. మరియు నాగదిలో నొకమూల నేల సొరంగముండున ట్లేర్పరిచెను. అందున్న వారెవ్వరికినిఁ గనంబడరు. అందులోనివారికి పైవారు గనంబడుచుందురు. ఆ కృత్యము తిమ్మర్సును రాయలును ముచ్చియునుగాక యితరులెవ్వరును నెఱుంగరు. ఆ గది యద్భుతమైన యలంకారములచే నింపంబడినది.

అట్లు తమ గ్రామమునకు వచ్చిన కళానిలయకుఁ దగు విడెదలు నియమించి సకలోపచారములు జరుగునట్లేర్పరిచెను. కళానిలయ వచ్చిన తరువాత ముహూర్తము నెపంబున రెండుమాసములు జాగుజేసిరి. మరియు నొకనాడు గర్భదానమునకు ముహూర్తము నిశ్చయించినట్లు ఆ చిన్నదానికిఁ దెలియజేయుచు మాకు వధూవరుల పీటపై గూర్చుండి యాశీర్వచనములు పుచ్చుకొనుట యాచారము లేదనియు నూరక గదిలోనికిఁ బోవుటయే సంప్రదాయమనియు నాఁడు సాయంకాలమునకే నియమింపఁబడిన గదిలోనికి రావలయుననియుం దెలియఁ జేసిరి.

అట్టి వార్తవిని యక్కలికియు దానేర్పరచుకొనిన కపటకృత్యమున కావిధం బనుకూలముగానే యున్నదని మిగుల సంతసించెను. అంతట సాయంకాలమున రాజ