పుట:కాశీమజిలీకథలు -01.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

167

అయ్యా! నేఁడు మాయింటికి దిమ్మర్సునకు మిత్రులైన బ్రాహ్మణు లిరువురు వచ్చిరి. వారితో మీప్రశ్నముల వృత్తాంతము చెప్పితిని. వానికి సమాదానము చెప్పెద మని ప్రతిజ్ఞపట్టి మిమ్ముఁ దోడ్కొని రమ్మనిన నేను వచ్చితిని. పోదము రండని పలికిన నమృతోపమానంబులగు నతని మాటలు విని మంత్రి దిగ్గునలేచి సోమశర్మా! ఆ పుణ్యాత్ములెక్కడ నున్నారు త్వరగాఁ బోవుదము రమ్మని యతనివెంట వారింటి కరిగి యందు నా కపటబ్రాహ్మణులం గని సాష్టాంగముగా వారి పాదంబులంబడి పుణ్యాత్ములారా! మీరు నా యాపద బాపుటకై వచ్చిన భగవంతులని తోచుచున్నయది రాజుతో రేపు నే నేమి చెప్పవలయునో బోధించి నాకుఁ బ్రాణదానంబు సేయుఁడు. మీ యుపకార మెన్నటికిని మరువనని పెక్కుగతుల నుతియింపం దొడంగిన నతని లేవనెత్తి తిమ్మర్సు అనఘా! నీ ప్రాణంబులు గాపాడెదము. నీవిఁక చింతింపకుము. రాజు నిన్నడిగిన ప్రశ్నముల కుత్తరములు మాటలచే నీవు చెప్పునవికావు. నేను క్రియలచే జూపించెద రేపుదయమున నీవు రాజనగరి కరిగి తన ప్రశ్నములకు సమాధానము చెప్పుమని యడిగినప్పుడు రాజుతో నిట్లనుము.

అయ్యా! తమ ప్రశ్నములు త్రిలోకజనమేధాభేద్యములు గదా! వాని జెప్పుటకు లౌకికవ్యాపారపారాయణుఁడనగు నా కెట్లు సాధ్యమగును. దురవబోధ్యము లగు వానిం బోధింప నొక విప్రుని నియమించితిని. సెలవైనచో నతనిం బిలిపించెద నని యడిగి యతం డొడంబడినప్పుడు నాకు వార్తనంపుమని చెప్పిన విని మంత్రియు వారి ముఖవిలాసములంబట్టి యట్టి పని సేయు సమర్ధులే యని నమ్మి సంతోషముతో వారిచే ననుజ్ఞాతుండై యింటి కరిగెను.

మఱునాఁడు రాజు సకలసామంతబంధుపారవారసమేతుండై కొలుపు తీర్చి మంత్రిరాక కెదురుచూచుచుండ నింతలో మంత్రియు సంతోషముతో రాజసభ జేరి యథా యోగ్యపీఠంబునం గూర్చుండియుండ రా జతనిఁ జూచి యమాత్యోత్తమా! నా ప్రశ్నలకు నడుత్తరం బూహించితివేని సత్వరంబుగ నుడువుము. లేకున్న నురిస్తంభము కడకుఁ బొమ్మని పలికిన నతం డిట్లనియె.

దేవా! మీ ప్రశ్నలు అమానుషంబులగుటచే నవి సామాన్యముగాఁ జెప్పనలవడునవి కావు. వాని ననుకూలముగా నిరూపించి చెప్పుట కొక పండితుని నిర్దేశించితిని సెలవైనచోఁ బిలిపించెద ననిన రాజు యింక నాలస్యము చేసెద వేమిటికి త్వరగా బిలిపింపుమనిన మంత్రి యప్పుడొక భటునిచే దిమ్మర్సునకు వార్తనంపెను. తిమ్మర్సు సామాన్యవస్త్రములు ధరించి చూచువారెల్ల నోహో! యితండా! రాజప్రశ్నముల డుత్తరము చెప్పువాఁడని పరిహాసము చేయుచుండ రాజసభ కరిగెను. సభ్యులెల్ల నతని జూచి యుల్లసమాడిరి. పిమ్మట నతం డొక పీఠంబున గూర్చునియుండ నతనికి రాజిట్లనియె.