పుట:కాశీమజిలీకథలు -01.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వారిరువురు నం దొకపూటకూటి పెద్దమ్మయింట బసజేసి దాని కెల్లరు నిచ్చుదానికన్న నెక్కుడు రొక్కం బిచ్చి భుజించిన వెనుక అమ్మా! ఈ యూరి వింతలేమని యడిగిన నామె వారికిట్లనియె. అయ్యలారా ! వింతలకేమిగాని యొకటివినుండు. సానుమంతంబను పేరంబరగుచున్న యీయూరు భానుమంతుండను రాజు పాలించుచున్నవాఁడు. అతనికి బురుషద్వేషిణి యని సార్థకనామముగల కూఁతురుగలదు. ఆ చిన్నది పురుషులంజూడదు. నిత్యమును బొద్దుట జలకేళిం దేల నూరిఁబయలనున్న విహార సరోవరంబున కరుగుచుండును. అప్పుడు వీధిలోఁబురుషులు నిలిచినచో రాజభటులు శిక్షింతురు. ఎన్నఁడును బ్రొద్దుట వీధిలోని కరుగకుఁడీ యని చెప్పిన విని మరల వారమ్మా! యమ్మానినికి బెండ్లి నైనదియా యని యడిగిరి. దానికా పెద్దమ్మ నవ్వుచు నోహో! గొడ్రాలా! నీకెందరు బిడ్డలని యడిగినట్లు ఆ మగువ మగవారి మొగమే చూడదని చెప్పుచుండ బెండ్లియైనదా యని యడిగిరి. వేయేల? ఆ బాల తండ్రినిగూడ చూడదనియె మరల వారు అవ్వా! అవ్వనిత యట్టి యుగ్రవ్రతము బూనుటకు హేతువెద్దియో తెలియునా యవి యడిగిన నా కారణము నాకుమాత్రమేగాక దాని తలిదండ్రులకు గూడ తెలియదని యుత్తరము జెప్పెను.

వారట్లు కొన్నిదినంబు లామె యింటనుండి తమ వెంటగొని వచ్చిన వజ్రపురవ్వలు పెక్కురొక్కమునకు మార్చి యా పట్టణమునకు జేరియేయున్న విశాలంబగు పొలమొకటి వెలకుఁ దీసికొని గృహనిర్మాణదక్షులగు పెక్కండ్రు శిల్పపుపనివాండ్ర రప్పించి శీఘ్రకాలంబుననే బహుసౌధవీథీమనోహరంబగు నొక పురంబును నప్పురాంతరంబున నొకకోటయుఁ బురబాహోద్యానవనంబున గేళీసరోవరంబును నిర్మించిరి. మఱియు నాయూరిలో భవంతులన్నియుఁ గాపురముండ జనులకు నుచితముగా నిచ్చి ధనసహాయము చేయుచుండిరి. అప్పురంబంతయు స్వల్పకాలములో బహుజనాకీర్ణమై యొప్పినది.

విక్రమసింహునకు వనితాద్వేషి యను పేరు పెట్టి యతని రాజుగాఁజేసి బహుశ్రుతుడు మంత్రియై శుభముహూర్తమునఁ గోటలోఁ బ్రవేశించి కొంత సైన్యమును గూర్చుకొని పెక్కండ్రకు నుద్యోగంబులిచ్చి వారిరువురు రాజచిహ్నములతో నా గ్రామంబు పాలింపఁదొడంగిరి.

విక్రమసింహుడు సింహాసన మెక్కిననాడె యాపురంబు వనితాద్వేషి మహారాజు పాలించుచున్నవా డఁటనియు నాయన ప్రతిదినంబు నుదయమునఁ గేళీసరోవరంబున కరుగుచుండుననియు నప్పుడు స్త్రీ లెవ్వరు బయటకు రాఁగూడదనియు వచ్చినవారు శిక్షింపబడుదురనియుఁ బ్రకటన పత్రికల వ్రాయించి యాయూరి యిండ్లగోడల కంటింపజేయుటయేగాక పురుషద్వేషిణి యున్నపురములోఁగూడ వ్యాపింపఁజేసిరి.