పుట:కాశీమజిలీకథలు -01.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

గాని దాని దైన్యోక్తు లతని తలంపు నిలువ నిచ్చినవి కావు.

అతండు చితసురతంబున నయ్యతివమతుక పరచుచుఁ గొన్ని దినంబులు గడపిన పిమ్మట నొకనాఁ డాపుష్పవతి పయింగల యీసునం జేసి కొందఱు సుందరులు క్రౌంచవతి యను రాణియొద్ద కరిగి వాని వృత్తాంతమంతయుం జెప్పిరి. చపలస్వభావయగు నమ్మగువ యట్టిమాట లాలించినయంత మేనెల్లం బులకరింప నెదుట నున్న యొకచేటి కంజీరి నీవతిరయంబుననరిగి యావన్నెకానితోఁగూడ పుష్పవతిం దొడ్కొనిరమ్మని పంపిన నమ్మించుఁబోఁడియు రాణినానతి నయ్యతివ కెఱింగించిన సంచలించిన డెందముతో నమ్మందయాన యాసుందరుం దోడ్కొని యప్పడయ్యేలికసానియొద్ద కరుదెంచినది.

దాని పజ్జ వచ్చుచున్న యారాచ చిన్నవానిం జూచి యాకాంత యత్యంత కంతు సంతాపవేధిత స్వాంతయై యెదురేగి యమ్మదవతీ మదనుని కంఠంబు భుజమృణాళంబుల బిగియంబట్టి తోడ్కొనివచ్చి యర్ధ సింహాసనమునఁ గూర్చుండఁబెట్టి మిగుల గౌరవించి పుష్పవతి కిట్లనియె.

పుష్పవతీ! యంధకార కూపంబునకు భాస్కరుండువోలె విపరీత జన నివేనం బగు మన దేశంబునకు నీ దివ్యపురుషుం డరుగుదేరనాకా తెరంగెరుఁకపరచక నీ యింటదాచుకొంటివేల. “రత్నహారీతు పార్ధివః" అనునట్లు వింతవస్తువులు దొరికినప్పు డేలికలకుఁ దెచ్చి యిచ్చు న్యాయ మెఱుంగవా? చాలు చాలు పోపొమ్మని దాని మందలించి విక్రమసింహునిం దోడ్కొకి యంతఃపురమున కరిగినది.

విక్రమసింహుఁడా రాణి వైభవమంతయుఁ జూచియు నామెకుఁ దనపై గల మోహమెఱింగియు నించుకయేని సంతసము వహింపఁడయ్యెను. “దుఃఖితేమనసి సర్వమసహ్యం” అనుమాట దప్పునా? పిమ్మట రాణియు వానిఁజూచి యార్యా! మా పూర్వపుణ్యంబున మిమ్ముఁ బొడగంటిమి. మాదురవస్థఁ బాపుటకై వచ్చిన భగవంతుఁడవని తోఁచుచున్నది. సుందరపురుష సంయోగంబు లేమింజేసి యీ దేశ స్త్రీలకుఁ బొడము పురుష సంతానమంతయు వికృతరూపముగా వెలయుచున్నది. నేనును గ్రొత్తగా సింహాసన మెక్కితిని. నాకును వికృతరూపుఁడగు నొకపురుషుఁడు గలఁడు గాని వానిమొగ మిదివరకు నేను జూడలేదు. నన్ను నీవు భార్యగా స్వీకరించి నాకొక పుత్రుం దయచేయుఁడని ప్రార్ధించిన దానిమాట లంగీకరించి యతం డనురాగము దోపఁ దదభీష్టముల నెరవేర్చెను.

అట్లు కొన్నిదినంబు లారాణితో విక్రమసింహుఁడు వేడుకగాఁ గ్రీడలఁ దేలునంత నాకాంత గర్భవతి యయ్యెను.

ఆ దేశమందు గర్భిణీ స్త్రీలు పురుష సాంగత్యము చేయరు. అట్టి చిహ్నములు