పుట:కాశీమజిలీకథలు -01.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పిమ్మట నా చిత్రకారునిచే ననిపించుకొని వారువురు నప్పురంబు వెడలి యప్పడఁతి నరయుచుఁ బెక్కు దేశంబులు దిరిగిరి.

ఒక్కనాడుదయంబున లేచి వారొక యడవి మార్గంబునం బడి నడచుచుండ నెండ తాకుడుకు మేనువాడ విక్రమసింహుడు నడువలేక యొక మ్రాకునీడం జదికిలఁ బడి అన్నా! బహుశ్రుతా! నాకీ యెండలో నడువ మిగుల శ్రమముగానున్నది. నాలుక యెండి మాటరాకయున్నది. దాహమగుచున్నది. గాన నేనిక్కడని పండుకొని యుండెద. ప్రాంతమున జలప్రదేశమున్నదేమో యరసి జలము దెత్తువేని దప్పి తీర్చుకొని నడిచెదం గాని యిప్పుడొక యడుగైన నడువనోప. అయ్యయో యిది మరుప్రదేశములాగున్నది. నీరు దేవ నాలస్యమైనచోఁ బ్రాణంబులు నిలువవు త్వరగా తెమ్మని దీనుండై యడిగిన చెలికాని దైన్యంబునకు వగచి యప్పుడా దిట్టయొక చెట్టు కొననెక్కి నలుదెసలం బరికింప నొకవంక జలవిహంగము లెగురుచుండుటఁ దిలకించి మేనుబులకింప సంతసముతో జెట్టుదిగి వయస్యా! యొకనిముషము తాళుము. ప్రాంతముననే జలమున్నది. వేగమున బోయి కొనివచ్చెదనని యతని నూరడం బలికి వడివడి జలంబులు దేర నాబహుశ్రుతుఁ డరిగెను. ఆ ప్రాంతముననే మానససరోవరంబునుంబోని యొకతటాకం బతనికి నేత్రపర్వము గావించెను.

అదియు రత్నసోపానంబులును కాంచనపద్మంబులును బంగారుకలువల గనకమణిరజితజలచరంబు నింద్రనీలబంభరంబులు గారుత్మతజలపతంగంబులుం కలిగి కుసుమతరులతావితానంబు తీరదారుణి నలంకరింప నమృతప్రాయంబగు తోయంబులచే నిండింపఁబడి యలఁతి యలలచే వెలయు నక్కొలనుఁ గనుంగొని మిగులఁ జెలగుచు నతండు ప్రాంతమ్ము జేరునంతలో నందున్న శిలాఫలకంబున నిట్లు వ్రాయఁబడియున్నది.

ఇది పురుషద్వేషిణియను రాజపుత్రిక క్రీడించు కేళీసరోవరము. దీని పొంతకుఁ బురుషు లెవ్వరును రారాదు. వచ్చినవారిని క్షమింపక నురిదీయుదురు. అని యున్న లిపి ముమ్మారు చదివి సంతోషభయంబులు మనంబునం బెనగొన నతఁ డౌరా! నాకీ నీటినెపంబున నాబోటి కత దేటవడినది. దైవానుగ్రహ మిట్లుండవలయు. వేగబోయి యీవృత్తాంత మెఱింగించి నామిత్రుని డెందమున కానందము పొందుపరచెదనని నాలుగుమూలలు పరికించి వడివడి నత్తటాకంబులోనికిఁ దిగి కడుపునిండ నీరుద్రాగి విశాలపర్ణపుటంబున జలంబులం బట్టి యత్యంతజవంబున మిత్రునికడకు వచ్చుచుండెను.

ఇంతలో నచ్చట చెట్టుక్రిందఁ బండుకొనియున్న విక్రమసింహుఁడు ప్రాంత మందొక భయంకరమగు ధ్వని వినంబడిన నిరాయుధుఁడై యున్న కతంబున వెరచి తటాలున నికటంబున నున్న సాలవృక్ష మెక్కెను.