పుట:హంసవింశతి.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lv


తొమ్మిదవ రాత్రి కథ

చిత్రఘనుఁడు చిత్తారివాఁడు. అతని భార్య వాచాలి. ఎన్నో తంటాలుపడి ఒక కొడుకును బుట్టించుకొనెను. అయినను స్వైర విహారము మానలేదు. ఒకనాఁటి ముని మాపునఁ గాళికాలయ ప్రాంతమునఁ దారాడుచు “ఏరా! తాళఁగ లేరా! రారా!" అని ఉపపతిని బిలుచుచుండెను. దాని గొంతువిని ఆదారిఁబోవు దాని భర్త దగ్గరి యెవరిఁబిల్చుచుంటి వని యడిగెను. వాచాలి అన్నది గదా! "అయ్యో! పసివాఁ డింటికి రాలేదు. నీ వెంబడి వచ్చి నాఁడేమో అని పిల్చుచున్నాను" అని. వాఁడు శిశుగతప్రాణి. అడలెత్తి వెదుకఁబోయెను. ఆమె యింటికిఁ బోయి తిరిగి, ఊరిలో బాలుని వెదకుచున్న పతి కెదురేఁగి “పసివాఁడు వచ్చి పండుకొని నిద్రబోవుచున్నాఁడు. రండి" అని తోడ్కొని పోయెను.

పదవ రాత్రి కథ.

భూతవైద్యుని భార్య ఘనురాలు. ఘనురాలికి ఉపపతులు నలుగురు: 1. కరణము 2. రెడ్డి 3. పారు పెత్తెగాఁడు 4. తలారి. ఒక నాఁటిరేయి వరుసగా నలుగురు, నొకరి పిదప నొకరు వచ్చిరి. ఆమె యందఱి నలరించెను. అయిదవ వాఁడు, వెళ్ళియుండిన పతి వచ్చెను. విటులు నలుగురు నాలుగు దిక్కుల నటుకలపై నుండిరి. తెచ్చిన బహుమానములు జూపుమని ఘనురాలు పతి నడిగెను. అతఁడు దివ్వె తెమ్మనెను. దివ్వె తెచ్చునంతలో అటుకలమీఁది వారు నలుగురు గబ గబ దూఁకి యుఱికిరి. 'ఎవరు వీరు. చెప్పు'మని కను లెఱ్ఱచేసి, కత్తి దూసి భూతవైద్యుఁడు భార్యనడిగెను. ఆమె యిట్లనెను. "నీవు పొరుగూరికిఁ బోయి చికిత్స చేయుచుంటివి. ఆ భూతము లిక్కడకు వచ్చి, నా మీఁదఁ బడి త్రొక్కుచున్నవి. నేను తాళఁజాల కున్నాను. నీవు భూతముల జోలికిఁ బోఁగూడ దఁట. పోయినచో నన్నుఁ జంపునఁట. ఇపుడు నిన్నుఁజూచి పరుగెత్తినవి. భూతముల చేతిలోఁ జచ్చుటకంటె నీ చేతిలోఁ జచ్చుట మేలుకదా ! చంపుము."

అతఁడు మెత్తబడి చేరఁధీసి మంత్రించి భయము బాఫెను.