పుట:హంసవింశతి.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

liv


గాఁపురము చేయుచుండెను. ఈమె పేరు చారు భాస్వతి. ఆలు మగలిద్దఱును వేసవిలోఁ గూళికిఁ జలివెందర నడపుచుండిరి. ఒకనాఁ డొక బ్రాహ్మణసుందరుఁడు దప్పిగొని వచ్చెను. తమకము పట్టలేక చారు భాస్వతి పట్టపగలే పతి కట్టెదుటనే వానినిఁ గౌఁగిలించుకొనెను. హరిశర్మ అదలించినను వినక యితఁడు మా మేనమామకొడుకని చెప్పి మఱిమఱి కౌఁగిలించుకొనెను. ఇంటిలోఁ గొన్నాళ్లు వాని నుంచుకొని సుఖించెను.

ఏడవ రాత్రి కథ

శుభవాటీ భద్రకారులు కంసాలి దంపతులు. దూర్తుఁడనువాఁడు వారికి శిష్యుడు - పేరుకుఁ దగినవాఁడు. బయట భద్రకారుఁడు, ఇంట శుభవాటి వానికి విద్య నేర్పుచుండిరి. ఒకనాఁడు చిన్న త్రాసుఁ దెమ్మని గురుఁడు శిష్యునకుఁ జెప్పెను. శిష్యుఁ డింటిలోనికిఁ బోయెను. గురుపత్ని తలుపు బిగించెను. ఎంత సేపటికిఁ ద్రాసు తేలేదు . గురుఁడు లేచి వచ్చెను. తలుపు చూచి శిష్యుని గద్దించి పిల్చెను. శుభవాటి పుటపుట త్రాసు త్రాళ్లు త్రెంచి వాని చేతఁబెట్టి వాకిలితీసి మటమటలాడుచు శిష్యుఁడు పనికిమాలినవాఁడని త్రాళ్లు త్రెంచి ముడివేసికొనుచున్నాఁడని భయపడి వాకిలి మూసికొన్నాఁడని పలికెను. భద్రకారుఁడు శిష్యుని తప్పు సర్ది భార్య ననునయించెను.

ఎనిమిదవ రాత్రి కథ

వసుమతీ ధనచిత్తులు వైశ్యదంపతులు. ఇద్దఱిద్దరే. పతి ముండల పాలు; సతి మిండల పాలు. ఒకనాఁటి చీఁకటిలో సంకేతమున-పొరపాటున-ఆలుమగలే కలిసికొన్నారు. పతి గుర్తించి కనిసి “ఈ నిశిలో నీవిటకు నొంటి నేమిటికిఁగా వచ్చితి?" వని ప్రశ్నించెను. ఆమె యిట్లనెను, “నా గోడు కాళికాదేవికి విన్నవించుకొనఁగా ఆమె యిపుడే నీకు నీపతి పొందు గలుగును. పొమ్మనెను. నేను వచ్చితిని. అంతా ఆ తల్లి ప్రసాదము" అప్పటికి ఆమెకై వచ్చియుండిన విటుఁడు పొదచాటుననుండి 'ఔ నిజ' మని - ఆకాశవాణీ ప్రసారము చేసెను. ఈ రీతిగాఁ గాళికా ప్రసాదముఁ గన్న సతికి సాష్టాంగపడి ప్రశంసించి సెట్టి యింటికిఁ దోడ్కొని పోయి సుఖముండెను.