పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సంతసించె నాచక్రి తురంగంబునకుఁ దగునాజ్ఞ యిచ్చి వకుళ
నాతురంగంబున నారోహింపఁజేసె. అంత నావకుళ చక్రి చెప్పి
నట్ల కపిలేశ్వరునకు నమస్కరించి ప్రార్థించి శుకునకు నగస్త్యు
లకు మ్రొక్కు లిడి శివలింగంబులకుం బ్రణమిల్లి యొక్కయెడఁ
గూర్చుండి తద్దేవాలయంబులో నిలిచియున్న కన్యకలయం
దొక్కకన్యను జేరఁ బిల్చి ప్రియోక్తుల నిట్లనియె.

351


క.

చెలి నీ వెవ్వరిదానవు
చెలువారఁగఁ జెప్పుమనినఁ జింతించుచు నా
చెలిమిన్న దాఁప కిట్లనె
జెలువారఁగ వకుళతోడఁ జిత్తం బలరన్.

352


సీ.

ఆకాశరాజేంద్రు నాత్మజచెలికత్తె
        ననఁగ నవ్వకుళ దానిని బ్రియంబుఁ
జూచి యమ్మా! మోము సొక్కినట్లున్నది
        యేమి చెప్పు మటన్న నా మెలంత
గని యమ్మ నాచింత కడుకష్టమైనదే
        నెట్లు చెప్పుదు నీకు నెల్ల మగువ
వకుళ యిట్లనెను దాఁపక చెప్పు మంతయు
        ననఁగ నాచెలికత్తె యనియె నిట్లు


తే.

వనవిహారంబు సేయంగ వాంఛ యెసంగి
మనుజనాథునిపుత్త్రి పద్మావతియును
మేము నట కేగి విహరింపఁ మేటిగజము
వచ్చెఁ బరుగిడి వెనువెంట వచ్చె నొకఁడు.

353