పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiv

4. కావ్య స్వరూపము - ఇందలికథ

ఇది ఏకాశ్వాస ప్రబంధము. సాధారణముగా కావ్యములు ఆశ్వాసములుగా విభక్తములగు చుండనిది మాత్రమిట్లు వ్రాయఁబడుట. అందును 882 పద్యములను ఒక్క గుక్కలో చెప్పుట, ఆలోచింపఁ దగినదే. శ్రీ పూండ్లవారు “ ఈ కావ్యమువలె నేకాశ్వాసముగా విరచింపఁ బడినది యిదివఱకు దృష్టిగోచరముగాలేదు...విభజించి వ్రాసియుండిన జదువువారలకుఁ గొంత గ్రుక్క ద్రిప్పుటకు వసతిగల్గి యుండును ...... కారణమేయ్యదియో విచారించు కొనుఁడు” అని వ్రాసిరి. ఆరుద్రగారు ఏమియు వ్రాయలేదు. వారి కెట్టి శంకయు పొడమలేదు. కాని నాకిట్లు తోచుచున్నది. ఈయన కాలమున యక్షగానములు బహుళ ప్రచారమునకు వచ్చినవి. వానిలో, అవి ప్రదర్శన యోగ్యములైనను, అంక విభజన లేదు. పాత్ర ప్రవేశ నిర్గమనాదుల వలన కథజరిగి పోవుచుండును. రాత్రియంతయు నాటకమాడువారు. ఈయన కావ్యములో యక్షగాన రచనా ప్రక్రియలు చాలా గలవు. వట్టికావ్యముగాక , చిత్రకావ్యమునుగాక, సంగీత కావ్యముగా కూడ దీనిని గ్రహింపవలసియున్నది. కాగా, వానివలెనే, కవి దీనిని ఏక శ్వాసముగా వ్రాసెనేమో. ఇది నృత్య నాటిక గా కూడ కొద్దిమార్పులతో ఆడదగినదిగా కనఁబడుచున్నది. హరికథా కాలక్షేపమునకు చాల తగియున్నది. సంగీతవిషయముల నెన్నిటినో కవియిందు చేర్చియున్నాడు. పైగా పూండ్ల వారు ఆశ్వాసాంతమున, అనగా నిచ్చట గ్రంథాంతమున గద్యవ్రాయక పద్యమే వ్రాసినాడు. ఇందులకు ఇతనికి మార్గదర్శకము ఆముక్తమాల్యదయనియు, ఆధునికులలో మండపాక వారొకరట్లు వ్రాసిరనియు తెలిసిరి. కాని వీరి కందఱికిని గురువు నైషధకావ్యకర్త, భట్ట శ్రీహర్షుడేల కారాదు? ఆతఁడు ప్రతియాశ్వాసముతుదను ఆముక్తమాల్యద పద్యములవంటి శ్లోకములు వ్రాసినాఁడు పైగా నాటకములలో భరతవాక్యము శ్లోకమేగావున ఆస్వరూపము కలుగుటకు కూడ కవి యిట్లొనరించి యుండును. ఈ భావముననే కాఁబోలు ఇట్లు భగవంతుని యాజ్ఞగా చెప్పుకొన్నాఁడు.

ప.33. 'మునుపు నిపుడుఁ గవులొనర్చు ననువుఁ దెనుఁగుఁ
        గబ్బములలోనఁ దెరనాటకంబు లెస్స
        గా వినికి సేయుగతి నలంకార సరణి
        వెలయ రచియించు యప్పయ వెంకటార్య'

ఇది వినికి సేయు' నాటకమా?