పుట:భీమేశ్వరపురాణము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

101


క.

చాటింపఁ బంచెఁ జంద్రకి, రీటుఁడు కైలాసనగపురీవీథుల ఘం
టాటంకృతితో దక్షుని, వాటికిఁ బయనంబు ప్రమథవరులకు ననుచున్.

18


వ.

అప్పుడు భవాని భవుసన్నిధిఁ జేతులు మొగిచి యిట్లని విన్నవించె.

19


తే.

పుట్టినిలు గాన నాకు నెప్పుడును బ్రేమ, దక్షవాటిక మీఁద నెంతయు ఘనంబు
సన్నిధానంబు సేయుమో చంద్రమౌళి, యమ్మహాపురి భీమలింగంబుమీఁద.

20


తే.

ఉత్తరంబునఁ గాశీపురోత్తమంబు, మోక్షలక్ష్మికి నెబ్బంగి మూలమయ్యె
దక్షిణంబున నాభంగి దక్షవాటి, మూలమౌఁగావుతను భోగమోక్షములకు.

21


తే.

కుంటి కుదుపు లశక్తులు కుష్ఠరోగు, బంధులును వృద్ధులును బాలు రాది గాఁగఁ
గాశి కరుగంగ లేనిబికారులెల్ల, మోక్షమును బొందుదురుగాక దక్షవాటి.

22


మ.

కలిదోషంబున నిష్ఠురాత్మకులునున్ గామాంధులుం బాపక
ర్ములు నజ్ఞానదవాగ్నిదగ్ధులును నై ప్రోద్యన్మహారౌరవా
నలిఁ గూలంగల దుష్టమానసులకుం వారాణశీతుల్యమై
కలుగుంగావుత ముక్తి దక్షపురి నీకారుణ్యసంభావనన్.

23


తే.

సర్వలోకంబులకును మోక్షదుండవైన, నీవు సన్నిహితుండవై నిల్చినపుడు
దక్షిణాపథకాశి శ్రీదక్షవాటి, భువనమాన్యంబ కద నాదు పుట్టినిల్లు.

24


వ.

అని విన్నవించిన యనంతరంబ యంబికావల్లభుండు మందరాచలకూటంబనం బొల్చి సంస్మృతిమాత్రంబునం బొడచూసి నిల్చిన వృషభంబు నెక్కి యథోచితంబుగా నమందానందంబున గిరిరాజనందన వెనుకదెస విఱియం గౌఁగిలించుకొనియుండం దమతమవాహనంబుల నారోహణంబు చేసి బ్రహ్మాదులు పరివేష్ఠించి చనుదేర శంసితవ్రతులైన యక్షసురసిద్ధసాధ్యులు ముందటం గెలనబలసి యేతేర హృద్యంబు లగుగద్యపద్యంబులు తుంబురునారదాదులు పఠింప వేదఘోషంబులు జయజయశబ్దంబులు వేణువీణాకాహళాదిపంచమహావాద్యనాదంబులు కుంజరబృంహితంబులు తురంగహేషితంబులు చెలంగ మూషకారూఢుండై వినాయకుండు మున్నాడినడువ సుబ్రహ్మణ్యుండు మయూరవాహనుండై కదిసికొలువ వసురుద్రాదిత్యులు దుర్గావీరభద్రభైరవులు నంతరాంతరంబులఁ జండీశ్వరాద్యసంఖ్యాతప్రమథగణంబులు బలసికొలువ కైలాసభవనంబుననుండి యక్షీణవిభవంబున దక్షారామంబు డాయంజనుదెంచునప్పుడు.

25


తే.

పొగడి రందు నికుంభకుంభోదరులును
బెరసి భద్రమహాకాళిభృంగిరిటులు
పాయు బగళంబు తొలఁగు విచ్చేయుఁడనుచుఁ
బార్శ్వములయందు మిగులనార్భటము సేయ.

26