పుట:తెలుగు వాక్యం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

3


(3)

a. నేను విద్యార్థిని.
b. మేము విద్యార్ధులము.
c. నువ్వు విద్యార్థిని.
d. మీరు విద్యార్ధులు,
e. మనము విద్యార్ధులము.

పై వాక్యాలలో ని, ము, అనే ప్రత్యయాలు క్రమంగా ఉత్తమ పురుష, ఏకవచన బోధకాలు. పు మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం. మధ్యమపురుష బహువచనానికి, ప్రథమపురుష బహువచనంకన్నా భిన్న మైనరూపంలేదు. ఈ ప్రత్యయాలు ము, ను, వు, లు. ఇవి ఇకారాంతనామాల తర్వాత మి, ని, వి గా మారతై. ఇది స్వర సమీకరణంవల్ల జరిగిన మార్పు.

1.12 ప్రాధాన్య వివక్షననుసరించి పై వాక్యాలలో ఉద్దేశ్య, విధేయ వ్యత్యాసం జరగవచ్చు. ఆ వ్యత్యాసం కింది ఉదాహరణలలో చూడవచ్చు.

(4)

a. నువ్వు గాడిదవు -> గాడిదవు నువ్వు.
b. నేను సుబ్బారావును -> సుబ్బారావును నేను.
c. మేము తెలుగు వాళ్ళం -> తెలుగు వాళ్ళం మేము.

పదక్రమంలో ఈ మార్పు ప్రాధాన్య వివక్షకోసంవచ్చింది. ఈ మార్పువల్ల ఆఖ్యాతస్థానానికి (Predicate-position) చేరిన నామం అధిక ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ప్రాధాన్య వివక్షకు పదక్రమవ్యత్యాసం తెలుగుభాష అనుసరించే మార్గాలలో ఒకటి. ఇంకొకమార్గం క్రమవ్యత్యాసం లేకుండా ప్రాధాన్యాన్ని చెప్పదలచుకొన్న పదాన్ని ఉచ్చారణలో ఊనికతో నొక్కి పలకటం. ఇదికాక ప్రశ్నార్ధకాది రూపాలను ఉద్దిష్ట నామానికి చేర్చటం ఇంకో పద్ధతి. ఈ పద్ధతి ముందుముందు వివరించబడుతుంది. ఈ క్రియారహిత వాక్యాలలో ఉద్దేశ్య, విధేయనామాలు ఏకవస్తుబోధకాలైనా ఏకరూపకాలుకావు. సాధారణంగా రెండూ సర్వనామాలుగా ఉండవు. కాని కొన్ని అర్ధవిశేషాలలో ఇట్లాంటివి కన్పిస్తాయి. అట్లాంటప్పుడు ఏవార్థకమైన ప్రత్యయం వీటిల్లో ఒక నామానికి చేరుతుంది. ఈ కింది వాక్యాలు అందుకు ఉదాహరణాలు.

(5)

a. వాడే వీడు.
b. అతనే ఇతను.