పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxvi

కృష్ణమూర్తి తత్వం


దివ్యజ్ఞాన బోధనల్లో ప్రతి అంశంతోనూ విభేదించే మరో కొత్త బాటను నిర్మించుకోవడం మొదలుపెట్టారు కృష్ణమూర్తి. పరిణతి చెందిన తన చింతన ద్వారా, ప్రసంగాల ద్వారా, సంభాషణల ద్వారా, రచనల ద్వారా శ్రోతల మనసులను జాగృతం చేయడానికి రకరకాల పద్ధతులు కనిపెట్టారు. సందేహించడం, ప్రశ్నించడమే ఆధ్యాత్మిక విచారణకు సరియైన పద్ధతి అని సూచించారు.

“సందేహం అమూల్యమైనది. మనసును అది ప్రక్షాళితం చేసి, స్వచ్ఛ పరుస్తుంది. ప్రశ్నించడమే, మనలో నాటుకున్న సందేహ బీజమే మన అన్వేషణలను సుస్పష్టంగా చేయడానికి సహాయపడుతుంది.”

హృదయాన్ని తెరచివుంచడానికి కూడా యీ బోధనల్లో తక్కువ విలువ ఏమి యివ్వలేదు. అది సౌందర్య భావంతో ఆరంభమై, జీవితంలోని అద్భుతాలతో, ప్రకృతి వర్ణాలతో జాగృతం చేయబడి, 'స్రోతస్సు' లో దాహం తీర్చుకున్నవారి సమక్షంలో ఆనందించడం జరుగుతుంది.

టి ఎస్ లో కృష్ణమూర్తి కొత్త బోధలకు వ్యతిరేకత త్వరలోనే బయటపడింది. క్రమంగా ఎక్కువైంది కూడా. శ్రీమతి బెసెంట్ యీ బోధలకు, పరమగురువుల శిష్యత్వానికీ నడుమన వారధులు నిర్మించడానికి ఎంతో సాహసంతో ప్రయత్నించింది. చివరకు రహస్య సాధన కార్యక్రమాల శాఖను కూడా ఆమె మూసివేయించింది. అయినా కూడా కృష్ణమూర్తి పై పై మర్యాదల కోసం రాజీ పడలేదు. ప్రస్తుతం అతడు అన్ని విధాలైన ఆధ్యాత్మిక ఆధిపత్యాలకూ వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. 1929 లో హాలెండులో జరిగిన తారకసంస్థ సమావేశంలో తారక సంస్థ సభ్యత్వాన్నంతటినీ రద్దు చేసే మహదైక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే “సత్యం బాటలు లేని సీమ” అని ప్రకటించాడు.

***

1929 కి ఆరు సంవత్సరాల ముందు నుంచీ కృష్ణమూర్తి రచనల్లో అన్వేషణ దీపం అంతర్ముఖంగా తిరిగి, పరిణతి చెందుతున్న అవగాహన పై వెలుగు ప్రసరిస్తూ వుండటం కనబడుతుంది. మొట్టమొదటి రచన అయిన 'మార్గం' అపరిపక్వతతో నిండి, పలుపలు విధాలుగా సాగిపోయే వచన కవిత. ప్రధాన వస్తువు లేకుండా అస్పష్టతతో వున్న యీ రచనలో అలసిపోయిన అన్వేషి కనబడీ కనబడని మార్గంలో పైకి ఎక్కుతూ కనబడతాడు, పరిపూర్ణత్వాన్ని చేరడం కోసం. అతడు ఒంటరి, నిస్సహాయుడు, అనేక పూర్వ జన్మల భారాన్ని మోస్తూ వుంటాడు. అందులోని నాయకుడు తనలో తను అనేక భాగాలుగా ముక్కలైపోయి, మార్పు చెందుతూ వుంటాడు. అలసియన్ జీవించిన అనేక జన్మలను తన లోపల సమీకరించుకుంటూ