పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxviii

కృష్ణమూర్తి తత్వం


అతని జీవితంలోని మహత్వపూర్ణమైన ఘట్టం అట్లా ప్రారంభమయింది. ఒహాయిలోని ఒక పిప్పలి వృక్షపు నీడలో 'మనుష్యుల సంతోషానికి అతీతమైన ఆనందంతో' కూర్చున్న వ్యక్తికీ, యూరపు అంతటా తిప్పుతూ రకరకాల పరీక్షలకు కూర్చోబెట్టినా ఎందులోనూ సఫలత సాధించలేక విసుగెట్టిపోయిన యువకునికీ పోలికే లేదు. మొదట్లో ఆరంభ సంవత్సరాల్లో తన భవిష్యకాలం గురించి అతనికి ఏవయినా అంతర్గతం నుండి సందేశాలు వినిపించి వుండవచ్చేమో కాని యిప్పుడు మాత్రం తన జీవితం ఏ దిశలో సాగాలన్నది గట్టిగా తెలిసిపోయింది. ఇక ఏ సందేహాలూ లేకుండా అతను సాగిపోయాడు.

'నా జీవితాన్ని నడిపించే తాత్వికత ఏమిటి అన్నది యిప్పుడు నాకు తెలియదు. అయితే ముందు ముందు నా తాత్వికత నాకు వుంటుంది... నా అంతట నేను అది తెలుసుకుంటాను. అప్పుడే యితరులకి నేను సహాయపడగలుగుతాను' అని అంతకు ఒక సంవత్సరానికి పూర్వం ఒక స్నేహితునికి వ్రాశాడు. అయితే అతడిని వివశత్వంలో ముంచిన ఆ మహత్వపూర్ణమైన అనుభవం పొందిన తరువాత, అతనిదైన తాత్వికత పూర్తిగా పరిణతి చెందాక కూడా, జీవితం చాలా నిగూఢమైనది, అందులో మన స్థానం ఏమిటి అనేది కనిపెట్టడం ప్రతివారూ తమకు తామే కొత్తగా తెలుసుకోవాలి అనే ఒక గ్రహింపు అతనిలో చిరకాలం వుండిపోయింది.

1922 ఆగస్టుకీ, మార్చి 1923 కీ మధ్యకాలంలో ఏం జరిగింది అన్నదానికి ఆధారాలు మనకి నిత్య వ్రాసి పెట్టుకున్న పుస్తకాల్లోనూ, ఆ యిద్దరు సోదరులూ శ్రీమతి బిసెంటుకు, లెడ్ బీటరుకు వ్రాసిన వుత్తరాల్లోనూ చాలా వరకు దొరుకుతాయి. ఆదృశ్య శక్తులు మైత్రేయుడి ఆవాహనకు తన అన్న శరీరాన్ని సిద్ధం చేస్తున్నాయనీ, ఆ పవిత్రకాండను తాను సాక్షిగా తిలకిస్తున్నాననీ నిత్య భావించారు. 1909 లో లెడ్ బీటరు చెప్పిన భవిష్యవాణి యిప్పుడు యీ విధంగా ఫలిస్తున్నదని కూడా భావించాడు.

ఆధునికులైన పాకులకు ఒహాయిలో జరిగిన యీ పరిణామ ప్రక్రియను అవగాహన చేసుకోవడం అంత సులువు కాదు. దిగ్ర్భాంతిలో మునిగి పోయిన నిత్య లాగే మనం కూడా మునుపు ఎన్నడూ అనుభవంలో, లేని యీ సంఘటనలను యోగంతోనో, మహాయాన బౌద్ధంతోనో ముడి పెట్టి, ఆ సంప్రదాయ సంబంధమైన శబ్దజాలం వుపయోగిస్తూ పరికించడం సహజమే. అయితే ప్రస్తుతం సంఘటనల వెనక వున్న పారభౌతికమైన అర్ధాలను నిర్ణయించకుండా వుండటమే వుత్తమం. దానికి బదులు కృష్ణమూర్తి జీవితం పై వీటి ప్రభావం, ప్రాధాన్యం ఏమిటి అన్నది గ్రహించడం ముఖ్యం.