పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxvii


ఒక దశాబ్దంపాటు జగద్గురువు అవడం కోసం శిక్షణ పొందాడు కృష్ణమూర్తి, అయితే రహస్య, మార్మిక సిద్ధాంతాలతోను, అతీంద్రియ శక్తులతోను నిండి వున్న యీ దివ్య జ్ఞానం 'అత్యంతమైన ఆపత్కర పరిస్థితి' లో వున్న ఆ యువతికి ఏ వుపశమనమూ యివ్వలేదని గ్రహించాడు. అంతకు మునుపు జరిగిన విపత్తు, మళ్ళీ యిప్పుడు మృత్యువు చేసిన యీ ఆఘాతం ఆమెని దారుణంగా బాధిస్తున్నాయి. ఆమెకు ఏ వూరటనూ అందించలేని స్థితిలో కృష్ణమూర్తి అపరిమితమైన ఒంటరితనాన్ని అనుభవించాడు. అయితే లోలోపల ఒక నమ్మకం కలుగుతున్నది. అసలైన మతం అంటే ప్రతి మనిషి అనుభవిస్తున్న యీ దుఃఖం అనబడేదానిని సూటిగా తాకాలి.

ఈ నమ్మకం సిద్ధాంతాలను కాని, తాత్విక జ్ఞానాన్ని కాని ఆధారంచేసుకొని కలిగినది కాదు; అంతఃస్ఫురణతో కూడిన ఎరుక వల్ల కలిగినది, అది ఒక ఒరిపిడిరాయిలా అతని లోపల నిక్షిప్తంగా వుంటూనే వచ్చింది.

యూరపులో తొమ్మిదేళ్ళు గడిపాక తన స్వదేశంలోని ఆచార సంప్రదాయాలతో సంబంధం పూర్తిగా సన్నగిల్లిపోయింది. అయితే దానికి బదులుగా మరొక పాశ్చాత్య సంప్రదాయమూ అతను తలదాల్చలేదు. అతీంద్రియ ప్రపంచం కూడా అతన్ని ఆకర్షించలేదు.

1621 నాటి శీతకాలంలో యిరవై ఆరు సంవత్సరాల వయసులో అతడు ఆస్ట్రేలియా వెళ్తూ భారతదేశంలో కొద్ది రోజులు ఆగాడు. అతనితో పాటు నిత్య కూడా ప్రయాణం చేస్తున్నాడు. అయితే నిత్య ఆరోగ్యం ఏమీ బాగులేదు. క్షయవ్యాధి అతని శరీరాన్ని క్రమంగా క్షీణింపచేస్తున్నది. ఏటా జరిగే దివ్యజ్ఞాన సమాజంవారి సమావేశాల్లో కృష్ణమూర్తి ప్రసంగించవలసి వున్నది. ఆ సందర్భంలోనే అతడు తన తండ్రిని చూడటానికి వెళ్ళాడు. బహుశ అదే అతను చివరిసారిగా తండ్రిని కలుసుకోవడం, వారి కలయికలో సంతోషం లేదు. అప్పుడు నిజంగా ఏం జరిగింది అనే విషయం తలా ఒక రకంగా చెప్తారు. కృష్ణమూర్తి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు, సాంప్రదాయకమైన రీతిలో. ఆప్రాచ్యులైన కొడుకుల స్పర్శతో మైలపడ్డానని నారాయణయ్య అనుకున్నాడనే భావం కృష్ణమూర్తికి కలిగింది. పూర్వ చరిత్ర కానీ, ముందుకు సాగవలసిన దిశ కానీ ఏదీ లేని దశలో కృష్ణమూర్తి 1922 ఆరంభంలో, కేలిఫోర్నియాలోని ఒహాయిలో ఏకాంతజీవనం అభిలషించాడు. అక్కడ వాతావరణంలో తేమ వుండదు, ప్రశాంతమైన పరిసరాలలో జనసమ్మర్ధానికి దూరంగా వున్న ప్రాంతం. నిత్య ఆరోగ్యం బాగుపడటానికి, కృష్ణమూర్తి అధ్యయనమూ, ధ్యానమూ సాగడానికి అనువైన ప్రదేశం.