పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.యస్.ఆర్. వాహన మిత్ర

61. ఆటో, టాక్సీ డ్రైవర్ల ఖర్చులలో కొంతమేరకు ప్రభుత్వం భరాయిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని నేరవేర్చడం కోసం ప్రభుత్వం వైయస్.ఆర్. వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆటోలు, టాక్సీలు, మాక్సీ కాబ్‌లు సొంతంగా కలిగి ఉండి నడుపుకుంటున్న డ్రైవర్లకు ఇన్సూరెన్సు, ఫిట్ నెస్ ధృవపత్రాలు, మరమ్మత్తులు మొదలైన వాటి నిమిత్తం రూ.10,000 వార్షిక సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పథకం కింద 2,36,340 మంది డ్రైవర్లు లబ్ధి పొందారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారని నేను సంతోషంగా సభకు తెలియ చేసుకుంటున్నాను. వీరిలో షెడ్యూల్డు కులాలకు చెందిన వారు 54,488 మంది, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు 8,763 మంది, వెనుకబడిన తరగతులకు చెందిన వారు 1,05,932 మంది, అల్ప సంఖ్యాక వర్గాల వారు 25,517 మంది, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 27,109 మంది, ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకు చెందిన వారు 13,091 మంది ఉన్నారు. ఈ సరికొత్త పథకాన్ని కొనసాగించే నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.275.52 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. నేతన్న నేస్తం

యంగ్ ఇండియాలో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్య ఇది.

'నేను ప్రతిసారీ రాట్నం మీద దారం తీసినప్పుడు భారతదేశంలోని పేదవారి గురించి ఆలోచిస్తాను... రాట్నం వడకడం ఒక తపస్సు, ఒక సంస్కారం. నేను రాట్నం మీద వడికే ప్రతి నూలు పోగులోనూ దేవుడిని చూస్తాను'.

జీవితాంతం చేనేతను ప్రోత్సహించి, నేతపనివారి పురోభివృద్ధిని కోరుకున్న మహాత్ముడి ఆశయమే జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వ ఆదర్శం. అందుకే చేనేత కార్మికుల పెద్దన్నగా ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు.

25