పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62. సాంప్రదాయిక వృత్తులను అవలంబిస్తున్న వివిధ వృత్తి పనివారల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నేత కుటుంబాల్లో నేత మగ్గం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పథకం కింద రూ. 24,000 వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతున్నది. తద్వారా ఆయా నేత కుటుంబాలు వారి మగ్గాలను ఆధునీకరించుకుని మరమగ్గాలతో పోటీపడటానికి వీలవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 81,709 చేనేత కుటుంబాలు లబ్దిపొందాయి. వీరిలో వెనుకబడిన తరగతుల వారు 75,011 మంది, షెడ్యూల్డు కులాల వారు 888 మంది, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు 329 మంది, ఇతర వర్గాల వారు 5,555 మంది ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వై.యస్.ఆర్. నేతన్న నేస్తం కింద రూ. 200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

63. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా బడుగు వర్గాలకు చెందిన వీధి వర్తకులు మరియు తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.10,000 ల చొప్పున జగనన్న తోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాము. గ్రామ స్థాయిలో 7 లక్షల మందికి మరియు పట్టణ స్థాయిలో 2.3 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం కోసం సుమారు రూ. 930 కోట్లు కేటాయించడం జరిగింది.

జగనన్న చేదోడు

64. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుట్టు వృత్తిని అవలంబిస్తున్న అన్ని కులాల టైలర్ల సంక్షేమానికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10,000 చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 247 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

26