పుట:Sinhagiri-Vachanamulu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

శ్రీ రఘువీరగద్య ఆంధ్రంకాదు

దీనికితోడు ఇందులో మరో “అఘాయిత్య " ఏమిటంటే కవితార్కిక సింహులు. సర్వతంత్రస్వతంత్ర బిరుదాంచితులు; శతాధిక గ్రంధకర్తలు వేదాంత దేశికవిఖ్యాతులు అయిన శ్రీమద్వేంకటనాధ కవులు సంస్కృతంలో చెప్పిన "శ్రీరఘువీరగద్య" ని అజ్ఞాతకర్తృకంగా ఆంధ్రగద్యచంద్రికలో ఉదాహరించేరు సంపాదకులు. గీర్వాణవాజ్మయాన్ని మనం ఎంత కొల్లగొట్టుకు అనుభవిస్తున్నా ఇంతదురన్యాయమా? ఇది అన్యాయ దురాక్రమణంకాదూ? ఇతరభాషలవారు శ్రీరఘువీరగద్యకర్తృత్వాన్ని గుర్తించలేని మన గీర్వాణ సాహితీ పరిచయాన్ని పరిహసించరూ ? ఇహవేదాంత దేశికులు తెలుగువారనో, ఆయన తెలుగులోనే యీ గద్యం వ్రాసేరనో, లేకపోతే మన ఆంధ్రకవివృషధులెవరో వ్రాసీన తెలుగు గద్యనే శ్రీమద్వేదాంత దేశికులు స్వీకరించి ఉంటారనో చిత్రచిత్ర సిద్ధాంతాలని ప్రతిపాదించాలి. దేశికులకు రమారమి నాలుగుపదులు ముందున్న కృష్ణమాచార్యులు 1945 నుంచి పత్రికల్లో ప్రధమాంధ్ర వచన కవితాచార్యుడుగా కీర్తింపబడుతున్నా ఆయన వచనం ఆంధ్రగద్యచంద్రికలో లేకపోవటం ఆత్మవంచన; ఇది పరవంచన.

సింహగిరివచనములు - స్వరూప స్వభావాలు.

ఇప్పటికి ముద్రితవచనాలు 60, వీటిలో కొన్ని సామాన్య లక్షణాలతో కొన్ని విశేష లక్షణాలూ ఉన్నాయి, ప్రతివచనం దేహఅనే సంబోధనతో ప్రారంభంఅయి, 'సింహగిరి నరహరీ నమోనమోదయానిధీ 'అనే మకుటంతో ముగియటం సామాన్యలక్షణం. ఈ మకుటంలో కొన్ని చోట్ల “మాయతి రామానుజముని పరందాతారు అని 'కృష్ణకువ్వారుస్వామీ' అనీ ముందు చేరటంకద్దు. వచనానికి ఏకరూపమైన పరిమితి పాటించినట్టు కనబడదు. "ఆలాపవర్ణనలతో నమోనారాయణాయని విష్ణునామ గుణ కథలు వచన భావంబున కీర్తించను. ఘుమఘుమ ధ్వనులు మ్రోయగాను దండెమీటుచు తాళంబులుగ్గడించుచు పంచమవేదస్మృతులును చాతుర్ల క్షగ్రంధ సంకీర్తన వాక్ఫూజలును చేయంగాను" అనేవాక్యాలవల్ల రాగభావంతో తాళానుగుణంగా తంత్రీ శ్రుతి సమన్వితంగా ఈ వచనాలు గానం చేయబడేవని తెలుస్తోంది.