169
25వ అధ్యాయము.
499. హరినామోచ్చారణము చెవులకు సోకగానె నేత్రములు బాష్పపూరితములగు దశ ప్రాప్తించునంతదాక భక్తిసాధనలు అవసరములు. భగవన్నామము సూచితమగు వెంటనే ఆనందబాష్పములు వెల్లివిఱియ, హృదయముప్పొంగునతనికి భక్తిసాధనలు ఇంక నగత్యములేదు.
500. భగవంతుడు పంచదారకొండవంటివాడు. చిన్న చీమపోయి ఒకచిన్న నలుసును తెచ్చికొనును; పెద్దచీమ పోయి ఒకపెద్ద పలుకును తెచ్చికొనును; కాని ఆకొండ ఎప్పటివలెనే యుండును; తఱగదు. భగవద్భక్తులు యిటులనే యున్నారు. భగవంతుని విభూతులలో అత్యల్పమగుదానిని గాంచియే వారు పరవశులయిపోవుదురు. వాని మహిమలను, విభూతులను, అపరోక్షముగ జూచుటకు ఏవాడును భరింపనోపడు.
501. కొందఱికి గుక్కెడుసారా త్రాగినంతనే తలతిరిగిపోవును. మరికొందఱికి రెండుమూడుసీసాలు త్రాగినగాని కైపురాదు; వీరును వారును కైపువలని ఆనందమును సమముగనే పొందుదురు. అదేవిధముగ కొందఱు భక్తులకు భగవద్విభూతియొక్క ఒక్కకిరణముంజూచిన మాత్రాన పరవశత కల్గును; మఱికొందఱు భక్తులకు జగన్నాధుని ప్రత్యక్షముగ దర్శించినప్పుడే పారవశ్యము చేకూరును; వీరును వారును గూడ దివ్యానందభరితులేయై సమముగ ధన్యులగుదురు.
502. బ్రహ్మజ్ఞానము పురుషునిబోలునది; భక్తియో స్త్రీ వంటిది; జ్ఞానమునకు భగవంతుని అతిధిశాలవఱకే ప్రవే