పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజమానుని భార్యతో నేమో సరసమాడఁగా మగఁడు విని సన్యాసి నేమైన నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణ యియ్యకపోగా ఆతనిని మూఁడు మాసములు వెలివేసి యేఁబది రూపాయలు పుచ్చుకొని ప్రాయశ్చిత్తము చేయించి తరువాత మతములో కలుపుకొన్నాడు. నేను వెంటనే వెళ్ళి మావానిచేత నపరాధ క్షమార్పణము కోరించినఁగాని కార్యము సుష్టుపడదు. కాబట్టి నన్ను బలవంతపెట్టక యీ పూటనే పంపివేయవలయును.

రాజ__మీరింతగా సెలవిచ్చుచున్నప్పుడు మిమ్మిఁక నిర్బంధ పెట్టఁగూడదు.

అని రాజశేఖరుడుగా రాయనకు క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిపి యాయనను బంపివేసిరి. తరువాత వివాహ నిమిత్తము వచ్చిన బంధువు లెవరి యూళ్ళకు వారు పోయిరి. ఆ సభికుఁడును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరుఁడుగారుచేసిన యాదరణమును ఆయనయొక్క యుపకార స్మృతియును సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువువారితో చెప్పవేఁడుకొనిన మాటలను విన్నవించెను.

రాజశేఖరుఁడుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న కొన్ని దినములకు నారాయణమూర్తి యొక నాఁడు వచ్చి, రహస్యముగా రాజశేఖరుఁడుగారితో తానును దామోదరయ్యయు బ్రాణమిత్రులుగానుండుటయు,దామోదరయ్యయొక్క మర ణానంతరము తానాతని చెలికాడను ద్వేషముచేత జనులు తనయింటఁ గల సొత్తంతయు దోపించుటయు అందువలనఁ దానిప్పుడు అన్న వస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుఁ జెప్పి సహాయ్యముచేయఁ వేడుకొనెను.

రాజ__కృతఘ్నుఁడును మిత్ర దొహియునగు నీవంటివాని కుపకార మెన్నఁడును జేయరాదు. నేను నీకెంతో మేలు చేసినవాడ