పదునేనవ ప్రకరణము
రాజశేఖరుఁడు గారు స్వగ్రామమునకుఁ బోవుట__సుబ్రహ్మణ్యము
వివాహము__సీత వివాహము__రాజశేఖరుఁడుగారు తానుబడిన
కష్టములవలన కృత్యమును నేర్చుకొని సుఖముగా జీవనము చేయు
చుండుట.
మఱునాఁడు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుఁడు గారు సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతి మహారాజుగారు తన సభికులలో నొకరిని బిలిచి రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందు బెట్టి 'మీ రీ ధనమును బట్టుకొని రాజశేఖరుఁడుగారితో ధవళేశ్వరమునకుఁ బోయి గృహమును మాన్యములను విడిపించియిచ్చి ర'డని యాజ్ఞాపించి అవిగాక మఱి నాలుగువందల రూపాయలను రాజశేఖ యఁడుగారికిచ్చి 'మీ రీసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్యము యొక్కయు వివాహములనుజేసి వచ్చుబడికి మించిన వ్యయ మెన్నఁడును జేయక సుఖజీవనము చేయుచుండుఁ' డని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవు పుచ్చుకొని రాజశేఖరుడుగారు భీమవరమునకు వెళ్ళునప్పటికి, జగ్గంపేటనుండి వచ్చి యింటికడ నెవ్వరో బంధువులు కాచియున్నారని సమాచారము తెలిసెను. ఆ మాట విని వేగిరపడి యిల్లు చేరఁగా వీధియరుగుమీఁద నొక ముసలి బ్రాహ్మణుఁడు కూరుచుండి యుండెను. రాజశేఖరుఁడుగా రాయనను జూచి మీరెవరని ప్రశ్నవేయఁగా, తమ యింటిపేరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియు జెప్పి 'రాజశేఖరుఁడు గారు మీరేకారా' యని ప్రశ్నవేసెను.
రాజ__అవును, మీ రేమిపనిమీఁద వచ్చినారు?