పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగాఁ జెప్పినారు. మొన్న నీనడుమ నొక శిష్యుఁ డెత్తుకొని పాఱి పోయినది గాక, యింకను పీఠమునకు రెండువేల రూపాయల వెండి సామాగ్రి యున్నవి.

రాజ__వారు గ్రామములో నున్నకాలములో మత సాంకర్య నివారణముగాని మత వ్యాపనముగాని చేయుటకేమయినఁ బ్రయత్నము చేసినారా?

సుబ్ర__అట్టి పను లేమియు చేయలేదు గాని యొక్క ఘన కార్యమును మాత్రము చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాల విధవ యున్నది. ఆమె యేమో భ్రూణహత్య చేసినదని గ్రామములోని సభాపతులు కొంద ఱామెను జాతినుండి బహిష్కారము చేసిరి. తరువాత నామె జగన్నాధసంతర్పణము చేసినప్పుడు ధనమున కాశపడి కొందఱు బ్రాహ్మణులు భోజనములు చేసిరి అందుచేత నక్కడకు భోజనములకు వెళ్ళినవారందఱు నొక కక్షగాను, వెళ్ళని వారందఱు నొక కక్షగాను నేర్పడిరి. లోకమున కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తుల నోము మొదలయిన వ్రతములు చేసి యప్పుడప్పుడు బ్రాహ్మణ సమారాధనములు చేయుచు వచ్చుచుండుట చేతను, క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షము వారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయంచేసి యా రెండు పక్షముల వారిని సమాధానపరచి, ఆమెయెుద్ద తాము రెండువందల రూపాయలను స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసివేయించి, ఆ కేశఖండన మహోత్సవ మయిన మరునాడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హస్తోదకము పుచ్చుకొని తరువాత బ్రాహ్మణుల కందఱకును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.

రాజ__ఆ స్వాములవారు పూర్వాశ్రమములో నే గ్రామ నివాసులు?

సుబ్ర__వారి నివాసస్థలము ముంగొండయగ్రహారము. ఆయనకు నలుగురు కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే