కొని యేదో యొకగ్రామము చేరవలెనను నాలోచన తోఁచి యా వస్త్ర ములను గట్టుకొని యంగీని తొడిగికొని పురుష వేషమును ధరించి, నా పూర్వపు బట్టలతోఁ జేర్చి మూటగట్టి నా శరీరమున నున్న నగలను తీసి చెంగున ముడివైచుకొని బయలుదేఱి, యొక కాలిమార్గమున నడచి తెల్లవాఱువఱ కొక గ్రామము జేరితిని. ఆ గ్రామములో ఆ పూటకుండి, నగల నమ్మివేసి రొక్క మును జేర్చు కొని తలమీఁది దెబ్బ చేత బాధపడుచునె చేరువగ్రామమునకుఁ బోయి యక్కడ కొన్ని దినములుండి వైద్యము చేయించుకొని నిమ్మళించిన తరువాత బయలుదేఱి చుట్టుపట్ల గ్రామములలోఁ దిరుగుచు పూటకూటి యిండ్లలో భోజనము చేయుచు పదియేను దినముల క్రిందట జగ్గం పేటఁ జేరితిని. ఆ గ్రామకరణము ముసలివాఁడును పుత్రసంతానము లేనివాఁడును గనుక నన్నుఁజూచి ముచ్చటపడి తనపనికి నేను సాయముగా నుందునని యెంచి నన్నుఁ దనయొద్దనే యుంచుకొని యాదరించుచు నా ప్రవర్తనమునకు మిక్కిలి సంతోషించి తనకున్న యొక్క కుమార్తెను నాకిచ్చి వివాహముచేసి యిల్లఱిక ముంచుకోవలెనను నుద్దేశముతో నా కులగోత్రనామముల నడిగి తెలిసికొనెను. నేనక్కడ సుబ్బరాయఁ డను పేరున మిక్కిలి నమ్మకముగానుండి, మీరు విద్య చెప్పించిన మహిమచేత లెక్కలు మొదలైనవి వ్రాయుటలో దోడుపడుచుండి, నాకు వెంకటేశ్వరుల మొక్కుచేత మావారు తలపెంచుకొనునట్లు చేసినారనియు, ఈ వ్రత సమాప్తి యగువఱకును తలయంటుకోఁగూడ దనియు చెప్పి, యా వ్రతమునకు భంగము కలుగకుండఁ గాపాడెదమని వారిచేత ననిపించుకొని పురుషవేషము బయలఁబడకుండఁ గడుపుకొనుచు వచ్చితిని, అట్లుండఁగా నొక నాఁడు మధ్యాహ్నము సీతనెత్తుకొనివచ్చి యెవ్వరో యిద్దఱు మనుష్యులు భోజనము పెట్టించుటకై నేనున్న యింటికిఁ దీసికొని వచ్చిరి. అప్పుడు మనము దాహముతీర్చి బ్రతికించినరాజు వచ్చి వాండ్రను కొట్టి సాగ నంపెను. అంతట నాయింటివారివద్ద సెలవు పుచ్చుకొని నేనును రాజుగారును సీతను దీసికొని వచ్చితిమి. మీ యంతట మీరందఱును నన్నానవాలుపట్టి కనుగొనువఱకును నేను రుక్మిణినని మీతో నెవ్వరి