నిలుచుచు అడుగొక యామడగా నడచి నాలుగు గడియల ప్రొద్దువేళ నల్లచెఱవు చేరిరి. ఆ చెఱువుగట్టునకు క్రిందుగానున్న యొక జువ్వి చెట్టు మొదలను తాటాకు పందిరిలో దేహమునిండ విభూతి పూసికొని కంఠమునను చేతులను శిరస్సునను రుద్రాక్షమాలలను ధరించుకొని గూరుచుండి వారిని సైగచేసి పిలిచి, దగ్గఱనున్న చాపమీఁద గూరు చుండ నియోగించి యెుక యోగి కుడిచేతిలోని తులసిపూసల తావళ మును ద్రిప్పుచు నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ నొక్కొక్క ప్రశ్న వేయనారంభించెను.
యోగి__మార్గస్థులారా! మీరు మిక్కిలి యెండఁబడి మార్గాయాసముచే బడలియున్నారు. కొంచెముసే పిక్కడ విశ్రమించి పొండి. సకుటుంబముగా బయలుదేఱినట్లున్నది. మీ రెక్కడకుఁ బోయెదరు ?
రాజ__కాశీయాత్ర పోవుచున్నాము.
యోగి__ అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు లభింపదు. త్రోవ పొడుగునను సత్రములు లేవు. మీరేమైనా ధనమును సేకరించు కొని మఱి బయలుదేఱినారు కారా?
రాజ__మావంటి బీదవారికి విశేష ధన మెక్కడనుండి వచ్చును? అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చు కొన్నాము. ఏలాగునైనను వానితోనే గంగాయాత్ర చేసికొని రావలె నని యున్నది.
యోగి__మీరు బహు జాగ్రత్తగా నుండవలెను. ఇక్కడకు రెండు క్రోసుల దూరములోనున్న వేడిమంగలము వద్ద బాటసారులను దొంగలు కొట్టుచుందురు. గడియసేపు తాళుదురేని మా శిష్యులను తోడిచ్చి పంపెదము.
అని చెప్పి యా యోగి తావళమును ద్రిప్పుచు మరల జపము చేయనారంభించెను. ఏవేళకును నాతని శిష్యులు రానందున, రాజశేఖ రుఁడుగారు మనసులో తొందరపడుచుండిరి. ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను.