పుట:Narayana Rao Novel.djvu/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాంతబోధ

345

లన్నియు సేవకులచే జేయించుటమాని, తానే చేయ దొరకొన్నది. విశ్వేశ్వరరావు గారికి భార్య పరివర్తన మాశ్చర్యము కలిగించినది.

ఇంటివిషయమై యన్నియు కనుగొనుట కారంభించినది. భర్తపక్కపై పరుపులు సరియైనవి లేవని, రాయలసీమలో దొరకు మంచి దూదితో చక్కని పరుపులు కుట్టించినది. రంగు రంగుల ఖద్దరు దుప్పట్లుకొన్నది. భర్తమంచముపై పెద్ద దోమతెర కట్టించినది. స్వయముగా తాంబూలము చుట్టి యిచ్చినది. విశ్వేశ్వరరావు ఇది యంతయుజూచి ఆశ్చర్యమునంది ‘ఏమిటిది, ఇంత శ్రద్ధ ఎప్పటినుంచి వచ్చింది? ఏదైనా ఉద్దేశంతో చేస్తున్నావా?’ అని యడిగెను. భర్తను గద్దించి మాఱుపలుకుచుండు శకుంతల నేడు మాట్లాడక చిరునవ్వున తనదారిని పోయినది. ఆమె కిప్పుడు గర్భము.

ఆనందరావుగారి కారులో దనబిడ్డల దీసికొని శకుంతల తిన్నగా నారాయణరావుగారి ఇంటికి వచ్చినది. శారద మోము ప్రఫుల్లమయ్యెను. శకుంతల సుబ్బారాయుడు గారిని చూచుటకు వచ్చినదని తెలియగనే జానకమ్మగారు సంతోషాశ్చర్యముల నందిరి. శకుంతల యందరిని బలుకరించి ఉన్న దన చెల్లెలితో సుబ్బారాయుడుగారు పండుకొన్న గదిలోనికి వెళ్ళి ‘మామయ్యగారూ! వంట్లో కులాసాగా ఉన్నదాండి?’ అని పలుకరించెను. సుబ్బారాయుడుగారు శకుంతల నానవాలుపట్టి చిరునవ్వుతో గది నెల్ల వెలిగించుచు, ‘అమ్మా కూర్చో, శారదా! కూర్చో’ యనియెను. శారదయు, శకుంతలయు నచ్చటనే యొక సోఫాపై నధివసించిరి.

‘మీకు జబ్బు చేసిందనీ, యిక్కడ శస్త్రం చేయించుటకు వెళ్లుచున్నారనీ మా బాబయ్య గారు ఉత్తరం రాశారు. మా చెల్లాయికూడా యీ ఊరినుంచి శస్త్రవైద్యం అయిందని, మీకు చాలా కులాసాగాఉన్నదనిన్నీ వ్రాసింది. ఉత్తరాలు రాగానే మీ అబ్బాయి గారినడిగి, వచ్చానండి. పుండు మానిందాండి?’

‘వేలు కొట్టేశారమ్మా.’

‘అదేమిటి, మామయ్యగారూ!’

‘వేలిమీద ఏదో వ్రణంట. ఆ వేలు కొంచెం ఎచ్చుతగ్గు అంతాపాడయిందట. అందుకని తీసివేశారు.’

‘ఏ వేలండి?!’

‘చిటికిన వేలే. కుడిచెయ్యికి కూడాను. మా అబ్బాయిగారు, బిడ్డలు అందరూ కులాసాగా ఉంటున్నారా, అమ్మా? వీళ్ళిద్దరూ నీ బిడ్డలామ్మా? యని ఆ బిడ్డల తనకడకు రమ్మని నవ్వుచు సుబ్బారాయుడుగారు పిలిచినారు. పెద్దకుఱ్ఱవాడు మాత్రమే సుబ్బారాయుడు గారికడకు వచ్చినాడు. సుబ్బారాయుడుగా రాబాలుని తల నిమిరి, ‘నాయనా ఆడుకో వెళ్ళి’ అని అన్నారు.

భోజనములైన వెనుక నాడువారందరు కూర్చున్నారు. వెంకాయమ్మ