పుట:Narayana Rao Novel.djvu/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మహత్య

341

‘’అదేమిటే? ఆ నాయుళ్ళబ్బాయి ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు! అల్లాంటివాడు, ప్రపంచం అంతా పాడుచేద్దామని తిరిగే పాపపు మనిషి విషం పుచ్చుకోవడ మేమిటి?

అప్పుడే నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతి, పరమేశ్వరమూర్తు లక్కడకు వచ్చినారు.

నారా: రాజేశ్వరరావు విషము పుచ్చుకొని చచ్చిపోయినాడని నాకు టెలిగ్రాం వచ్చినది చెల్లీ! నీ చదువు అడ్డంకొడ్తున్నాను. నాకు రెండుత్తరాలు యివాళ వచ్చినాయి. టెలిగ్రాం హైదరాబాదు పోలీసు వారు పంపించినారు. ఉత్తరాలు రాజేశ్వరుడు ఇంకో నిమిషానికి విషం పుచ్చుకోబోతూ వ్రాసినవి. అందులో నీకోటి ఉన్నది. అది నేను విప్పలేదు. నా పేరున నీకు వ్రాసినాడు, ఇదిగో.

శ్యామసుందరి ఆ యుత్తరమును నారాయణరావు చేతి నుండి కంపిత హస్తములతో తీసికొని బల్లపై పెట్టి, యిట్లు చెప్ప నారంభించినది:

‘నా స్నేహితులు, నాకు సహోదరులవంటివారగు మీదగ్గర చెప్పుతున్నాను.

‘మూడేళ్ళక్రిందట రాజేశ్వరరావు మాయింటికి స్నేహితుడుగా వచ్చేవాడు. అతన్ని వేరే స్నేహితుడు తీసికొనివచ్చి పరిచయం చేసినాడు. సరదాగా మాటలంటూ నవ్వుపుట్టించే హాస్యం చేస్తూ, సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని హేళన చేస్తూ మాయింటికి యెప్పుడూ వచ్చేవాడు. ఒక నాడు స్వతంత్ర ప్రేమ అని ఒక ఉపన్యాసం ప్రారంభించాడు. అంతా చెప్పి ‘నీమీద నాకు చాలా ప్రేమ ఉన్నది. నీకూ అలాగే నామీద ప్రేమ ఉంటే నన్ను పాలించుకో’ అన్నాడు అన్నా! నేను మాటలాడలేకపోయాను. మూర్ఛవచ్చినట్లయినది, ఒక్కసారిగా లేచి, మహాకోపంతో ‘వెళ్ళి సముద్రంలో ఉరుకు దుర్మార్గుడా! రాక్షసుడా!’ అని ఒళ్లు తెలియకుండా కేకలు వేశాను. నాటికి నేటికి అతన్ని చూడలేదు. అప్పుడప్పుడు మా సంభాషణలలో అతడు మీ స్నేహితుడని విన్నాను. అంతే. ఆ ఉత్తరం మీరే అందరికీ చదివి వినిపించండి అన్నగారూ!’ అనినది. ఆమె ఆడుసింహమువలె క్రోధరూపయైనది. మోము జేవురించినది. సహజమగు నామె సౌందర్యమునకు కోపముచే విపరీత శోభ వచ్చినది. నారాయణ రావు ఆ కవరు చింపి. లోన ఉత్తరము తీసి మడతవిప్పి ఇట్లు చదవ నారంభించినాడు:

‘శ్రీ శ్యామసుందరీ దేవికి–

అమ్మా, నమస్కారములు. ఈ పాపిని నువ్వు ఈపాటికి మరచిపోయి ఉండవచ్చును. ఆ రోజున నువ్వు ప్రళయశక్తి వలె లేచి నాపై కేకలు వేస్తే భయపడి పారిపోయాను. నేను నా అభిప్రాయాల్ని సత్యమైనవానిగా నమ్మాను. అవే మీకూ చెప్పాను. చెప్పి నా హృదయంలో ఉన్న కోర్కె మీకు తెలియ