పుట:Narayana Rao Novel.djvu/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



౧౨



ఆత్మహత్య

‘నా హృదయము నారాయణ రావు నావరించి వదలి రాకున్న దేల?’ అను ప్రశ్న శ్యామసుందరిని వీడలేదు. నారాయణునిపై తనకున్న ప్రేమతత్త్వ మెట్టిదోయని యాలోచించుకొన్నది. ఆ ప్రేమ వాంఛాప్రేరితము మాత్రము కాదు. అది ఒక్కసారే కలిగినది. నే డాతడు ప్రేమార్థియైవచ్చి తన్ను కోరినను, దాను కుంచించుకొనిపోవలసినదే. ఆ దినమున తన శరీరాంగములన్నియు నుప్పొంగిపోయినవి. మూర్తీభవించిన ఆతని పురుషత్వము తలచుకొన్నను నేడు పుల్కయైన జనింపకుండుట కాశ్చర్య మొందినది శ్యామసుందరీ దేవి.

ఆ దివ్యముహూర్తము, తా నాతని కౌగిలిలో కరిగిపోయిన పరమప్రసన్నత, తన జీవితములో ముందునకు దారిజూపు దివ్య తేజస్సువంటిది యని యామె నిర్ధారణ చేసికొన్నది. అప్పటి నుండియు నామెకు సకలలోకములు తన్ను జుట్టు కొన్నట్లు భావము తోచినది. ‘నే నందరిని బ్రేమించుచున్నాను, నన్నందరు ప్రేమించుచున్నారు. నేను ప్రేమమూర్తిని. ప్రేమచే నందరు నాలో నున్నా’ రన్న దివ్యవాణి తనలో ప్రతిధ్వనించుచున్నదని యామె భావించుకొన్న ది. ఆనాటి నుండి ఆమె ప్రతిజీవియందును ప్రేమానుభావము జూచినది.

ఇంతలో రాజారావు వచ్చినాడు సుబ్బారాయుడు గారి జబ్బుకొరకు. రాజారావునకు భార్యపోయినదా? ఆయన జన్మము తరించు సంసార నౌక విచ్ఛిన్నమైపోయినదా? ఆయనతో జేయిచేయి కలుపుకొని బ్రతుకు తెరువు నడచు బాటసారి భగ్నమైపోయినదా? ఆమె కిరువురు బిడ్డలట. ఆ బిడ్డల నాదరించి పెంచువా రెవరు? మూడు కాళ్ళ ముదుసలియగు మాతామహియా?

రాజారావు వివాహ మేల యాడకూడదు? ఛీ! అదేమి యాలోచన. ఆయన వేదాంతియనియు, అందువలన ఆయన హృదయము కర్కశమైనదనియు దనతో నొకనాడు నారాయణరావు చెప్పినాడు. అట్టి పుణ్యపురుషుడు మరల వివాహము చేసికొనునా? ఆయన బాలికల యదృష్ట మెట్టిదియో? తనతో నారాయణరావు అన్న గారు సూరమాంబ పావనచరిత్రయని చెప్పినాడు. గంభీరహృదయుడగు నారాయణరావే ఆమె పేరు తలచుకొని కన్నీరు పెట్టుకొన్నాడు. ఆ వార్త విని సూరీడు చెల్లి తనఒడిలో జేరి, వెక్కి వెక్కి వాపోయినది. ఆ సూరమాంబ ఎంత సాధ్వియో?’

ఇట్టి యాలోచనలు తన్నావరించుకొన వదలించుకొనుచు వైద్యపరీక్షకై సంపూర్ణ దీక్షవహించి చదువుకొనుచున్నది శ్యామసుందరి.

ఇంతలో రాజేశ్వరరావు విషముపుచ్చుకొని చనిపోయినాడని రోహిణి వార్త తెచ్చినది.