పుట:Narayana Rao Novel.djvu/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ తు ర్థ భా గ ము

౧ ( 1 )

భ ర్త యే గు రు వు

క్రిస్టమసు సెలవులలో నారాయణరావు తన భార్యతో చెన్నపురికి వచ్చెను.

అతడు మైలాపూరులో వెనుకటి చిన్న మేడవదలి, నెలకు నూరురూపాయ లిచ్చి పెద్దమేడ నద్దెకు పుచ్చుకొనెను. ఆ మేడచుట్టు తోటయున్నది. విశాలమైన భవనము.

పరమేశ్వరుని భార్యకు బురుడు చెన్నపురిలో బోయుట కాత డేర్పాటు చేసెను. చెన్నపురిలో కాపురము బెట్టినప్పుడే యాతడొక నియ్యోగి వంటలక్కను గుంటూరు జిల్లానుండి రప్పించుకొనెను. ఆమె యిదివరకే తూర్పుగోదావరిజిల్లాలో నధికారులకు వంటచేసినది. మంచి మనసుది. నెలకు బదునైదు రూపాయలు జీతమును, యేడాదికి నాలుగుపంచెలు నిచ్చుట కేర్పాటు చేసికొని యాత డామెను గుదిర్చెను.

శారదను క్రిస్టమసు సెలవులలో మంచిరోజుచూచి యత్తవారింటికి తీసికొనివచ్చుటకు సూర్యకాంతమును, సుబ్బారాయుడుగారును వెళ్లినారు. ఆమెకు జమీందారుగారు వెలపొడవు చీరలు, పసుపు, కుంకుమ, రెవికలు, నగలు, వెండిబిందెలు, వెండిగంగాళము, వెండిచెంబులు, వెండిగిన్నెలు, వెండిబొమ్మ సామానులు, వ్రాత బల్లలు, కుర్చీలు, సోఫాలు, పందిరిమంచము, చిన్నమంచము, పెద్ద ఉయ్యెల, యింకను నెన్నియో సామానులు సారె యిచ్చినారు. కొన్ని చెన్నపురికి గొనిపోవుటకు రాజమహేంద్రవరములోనే యుంచినారు.

లాంచిమిద, మోటారుకారులమీద వారు కొత్తపేట చేరిరి. భార్యవచ్చినప్పడు నారాయణుని హృదయము దడదడ కొట్టుకొన్నది. రాత్రి గదిలోనికి వచ్చినప్పుడాతడు కదలు హృదయముతో, కంఠాన తీపులతో, కన్నులలో వెలుగులతో భార్యవంక జూచినాడు. కాని యా బాలిక మాట్లాడలేదు.

నారాయణరావు ఉదారహృదయుడై నొసలు ముడిచి, పెదవులు బిగించి, ముక్కుపుటములు విస్ఫారితములుకాగా, తన పందిరిమంచముపై యట్లనే పరుండియుండిపోయెను.

భార్యాభర్తలు చెన్నపురి కాపురమునకు వచ్చినప్పటినుండియు ఆ బాలికను బలుకరించుట యెట్లు, ఆమెకు చదువుజెప్పుట యెట్లని యాలోచింపదొడగెను.