పుట:Narayana Rao Novel.djvu/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

నా రా య ణ రా వు

 కుమారుని పునస్సంధాన మహోత్సవము త్వరలో జరుగవలయుననియు, కోడలు తన యింటికి త్వరలో గాపురమునకు రావలయుననియు మురియుచున్న నారాయణునితల్లి భర్తను తొందరపెట్టి యుత్తరము వ్రాయించినది.

వియ్యంకుని యుత్తరము జమీందారుగారు భార్యకు జదివి వినిపించి యీపట్టు తప్పదన్నారు. శారద కాసంగతి తల్లి చెప్పటతోడనే యొకటి రెండుసంవత్సరములవఱకు దప్పిపోయినదని సంతోషించిన యా బాలిక విచార గ్రస్తురాలయి, తల్లితో నెట్లయిన నింకొక సంవత్సరమువఱకు నిట్టివి తలపెట్టకుండ జేయవలెనని మరియు మరియు గోరినది. తల్లి భర్తకడకు పోయి శారద యింకను జిన్న పిల్లయనియు నిప్పడింత తొందర యేమివచ్చినదనియు బాలికలకు బదునెనిమిదవయేటివరకు వివాహము చేయించ వలనుపడదని వాదించిన వారిలో మీరొకరుకాదా యనియు నామె భర్తతో వాదించినది. జమీందారుగారి కామె చెప్పు మాటలన్నియు సత్యపూరితములని తెలియును. ఈ పల్లెటూరివా రిట్టి తెలివితక్కువ లేల జేతురో యని యాయన విసుగుకొన్నాడు.

భర్త వ్యతిరేకముగ నున్నాడనుకొని ఇప్పుడీ శుభకార్యము శారదకే యెంతమాత్రము ఇష్టములేదని జమీందారిణి చెప్పినది. జమీందారుగారు ‘ఆఁ! శారద కిష్టములేదూ? అవును. చిన్నపిల్ల. ఇంకను చదువుకొనుపిల్ల. ఆటల సరదాఅయినా వదల్లేదు. సంగీతము అది పూర్తికాలేదు. నిజమే, గట్టిగా ‘వీల్లేదు’ అని రాస్తాను.’

‘శారద కళ్ళనీళ్లు పెట్టుకొని యేడ్చిందికూడాను!’

‘శారదకంటిలో నీరే! అదేమిటి? నా వెఱ్ఱితల్లి, శారదకు కంటి నీరెందుకు? సిగ్గు చేతనేమొ? చదువు చెడిపోవునని భయమా? చదువుకున్న బాలికలు త్వరలో భర్తలయిండ్లకు బోవుట కిష్టపడరు. అయిన నెంత యాలోచించినను శారద కళ్ళనీరు పెట్టుకొనునంతటి భయమేమియు గనబడదే?

భార్యయు, నితర చుట్టములు, తన వియ్యాలవారిని అల్లుని హేళన జేయుట జమీందారుగారు గ్రహించినారు. అట్టి సందర్భముల నెంత యాలోచించిన, నాయనకు పునస్సంధాన మహోత్సవ మాపుచేయుట కిష్టములేదు. కార్యమొనరించిన మరునాడే కాపురమునకుబోవ నవసరములేదుకదా. కాబట్టి శారద యే కారణమునను భయపడ నక్కరలేదు.

శుభకార్యము తప్పలేదు. శారద మరియు గారాముచేసి పట్టుపట్టినచో జమీందారు డేదేని వంకబెట్టి కార్యము మాన్పించునేమో. కాని శారదయు అది బాగుండదని యాలోచించినది. తప్పక కార్యమైన నేమిచేయవలె? భగవంతు డెట్టి కష్టము దెచ్చిపెట్టినాడు. పేరునకు భర్తయైనను ప్రేమలేమి, పరపురుషుడేకదా! పరపురుషుడెట్లు తన్నంటుట?