పుట:Narayana Rao Novel.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రి క్త కాం క్ష లు

209


‘వాళ్లు పూర్వకాలపు మనుష్యులయితే నేమి? వాళ్ళంత మర్యాదస్తులు ఉదారహృదయం కలవాళ్లు మన నియోగుల్లో ఇంకోళ్లులేరు. పిల్లవాడు మహారాజులకు అల్లుడు కాదగిన మహానుభావుడు. నిజంగా అటువంటి అల్లుడు నాకు లభించడంవల్ల నా జన్మ పావనమయిందని నా ఊహ!’

‘మీకు మీ అల్లుడంటే మహాపక్షపాతం. ఏది ఎట్లాగయినా మీరీ కార్యంమాట ప్రస్తుతం ఆపుచెయ్యండి. అది నా ప్రార్థన.’

‘మాట యిచ్చాను. బహుశా వేసవికాలందాక గడుపుతాను. అమ్మాయి పెద్దమనిషి అయి ఏణ్ణార్థం అవుతుంది. క్రిస్టమసు నెలరోజులలో వస్తుంది. అప్పుడీ శుభకార్యం చేయిస్తే బాగుంటుంది అని వ్రాశారు సుబ్బారాయుడు గారు. నిన్న సరేనని వ్రాశాను. ఇవ్వాళ వేసంగి సెలవులదాకా వీలులేదు ఆని వ్రాస్తాను.’

అప్పటికి తాత్కాలికముగా శారద కా యాపద గడచినది.

కాని సుబ్బారాయుడుగారు మరల చైత్రమాసములో జమీందారుగారి కిట్లుత్తరము వ్రాసినాడు.

ది 5 ఏప్రిల్ 1928 సం. మకాం కొత్తపేట.

మహారాజరాజశ్రీ శ్రీమంతపరరాజగండ, మహాభట్టారక శ్రీ శ్రీ రాజా తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు బహద్దరు జమీందారు బావగారి సముఖమునకు.

ఉభయకుశలోపరి

ఇక్కడ అందరూ క్షేమం, అక్కడ శ్రీ శ్రీ మహలక్ష్మీ సమానురాలగు అక్కగారి క్షేమమున్ను శ్రీ శ్రీ గం. స. వదినగారి క్షేమమున్ను శ్రీరస్తు చిరంజీవి సౌభాగ్యవతులగు మాకోడళ్లు శకుంతలమ్మ, శారదల క్షేమమున్ను శ్రీ శ్రీ మా అల్లుళ్ళు కుమారరాజా కేశవచంద్రరావు క్షేమమున్ను బంధుమిత్రాదుల క్షేమమున్ను వ్రాయించకోరుచున్నాను.

తర్వాత, చి. మా అబ్బాయికార్యము తాము వెనుక తమఉత్తరములో సెలవిచ్చిన ప్రకారము ఈ వైశాఖమాసంలో శుభముహూర్తములున్నవి. తారాచంద్రబలాలు మొదలు సమస్తవిషయాలతో గొప్ప ముహూర్తం కుదిరింది. కాబట్టి తా మా ముహూర్తము పరిశీలించి యనుమతించవలయునని పార్థించుచున్నాను.

చిత్తగించవలెను.

విధేయుడు

త. సుబ్బారాయుడువ్రాలు