పుట:Narayana Rao Novel.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

నా రా య ణ రా వు



లక్ష్మీ : (చిరునవ్వుతో) చిత్తం! నాకుమాత్ర మేమి తెలుసునండి!

జమీం: అవునుగదా! నా మనస్సు చివికిపోయేటంత వరకు గాలించి వొదిలేను. ఇంత దగ్గిరలో మహారాజులు ముచ్చటపడిపోయే సంబంధం ఉందని తెలియక పోయింది. కాని భగవంతుని కృపవల్ల ఇప్పటికైనా తెలిసింది. లేక పోతే నా జన్మల్లా దుఃఖపడి ఉందును.

లక్ష్మీ: మనస్సులు కలిస్తే అంతా అల్లాకనబడుతుంది. నాకూ, మావాడు మీ అల్లుడు కావడం ఎంతో సంతోషం. కాని మా కుటుంబాలు పల్లెటూరి కుటుంబాలు!

జమీందారు గా రాలోచనాపథములలో నెగయుచు అర్ధనిమీలిత నేత్రులయి కూరుచుండిరి. రైలు కొవ్వూరిలో ఆగి, గోదావరి వంతెన దాటుచున్నది.

సుందరీమణియై, నారాయణరావు పోలికలు గలిగి, ఒక చిన్న బాలునకు తల్లియైన ప్రోయాలొకర్తు కొత్తపేటలో నాపె పుట్టినింట తనకై ఎదురు చూచు చున్నట్లు తోచి, లక్ష్మీపతి, చిరునగవు మెరుములీన, గోదావరి జలముల పార జూచుచుండెను. ఆమె ప్రేమమూర్తి. భర్తకు సదుపాయము లమర్చుచు నామె వేయికనులు, వేయిచేతులతో పరిచర్య చేయును. ఈ నిర్మల గౌతమీనీలజల ములకు నామె హృదయమునకు ఎంత చుట్టరికమున్నది! తమ సర్వస్వము భర్తలకే ధారపోయు హిందూవనితామణులు భర్తలకు పూజింపదగిన వారు. లక్ష్మీపతిరా వా గౌతమీ నిర్మలగంభీరతలో తన ముద్దుబిడ్డ మోమింతలో చూచినాడు. ఆతని మోమున, సంధ్యాకాశమున అరుణరాగమువలె, చిరున వ్వలంక రించినది.

బండి గోదావరి దాటి స్టేషనుకడకు వచ్చి ఆగినది. జమీందారుగారును, లక్ష్మీపతియు బండి దిగినారు. లక్ష్మీపతి ‘అయ్యా, సెలవు పుచ్చుకుంటాను. నమస్కారమండి’ అని తన స్నేహితులున్న పెట్టెకడకు పోయినాడు. ఆలం ఏలూరిలో నే దిగినాడు. కూలీలు మూడునిముషములలో సామానులు సర్దినారు. రాజేశ్వరరావు, నారాయణ రావు, లక్ష్మీపతి గారలు పరమేశ్వరమూర్తి, రాజారావుల బుజాలమీద తట్టిరి. ప్రీతిపూర్వకముగా కరస్పర్శ గావించి, వారు సెలవు గైకొని టిక్కెట్లు పుచ్చుకొను ద్వారముకడకు వచ్చినారు. ఇంతలో జమీందారు గారును వేరొక పెద్దమనిషియు, నలుగురయిదుగురు జవానులు ముగ్గురు జమీందారీయుద్యోగు లీయువకులకడకు వచ్చినారు.

జమీం: ఈయన నాకు చిన్నతనాన్నుంచి స్నేహితుడు. వేపా శ్రీనివాసరావు గారు, ఈ ఊళ్లో పెద్ద వకీలు.

శ్రీని: చాలా సంతోషంగా ఉందండి మీవంటి పడుచువాళ్లను కలుసు కోవడం. మరేమంటే మీరు భావి ఆంధ్రదేశానికి కీర్తితెచ్చే మణులని మా జమీందారుగారు చాలా చెప్పారు, యీ రెండు నిమిషాల్లోనే.