పుట:Narayana Rao Novel.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా స న స భ

157

తగిన వైద్యం సమకట్టుతాడు. మహాత్మాగాంధి, అట్టి వైద్యుడనే నిర్ధారణలున్నవి. కాబట్టి ఆయనమార్గము పూర్తిగా తొక్కక తలోవైద్యం చేస్తే దేశం యొక్క జబ్బు ఎల్లా కుదుర్తుందండి?

జమీందారు: దేశబంధుదాసుగారి పద్ధతికూడ మనం ప్రయత్నంచేసి చూస్తే మంచిదికాదా?

పర: దానికి గాంధీగా రడ్డుపడకుండా తప్పుకొని దాసుగారు మొదలగు వారితో రాజీనామా చేసుకొని తాను ఖద్దరు, పంచమోద్ధరణ నెరవేర్చెదనని సంకల్పించుకొన్నారు గాదండీ?

జమీం: నిశ్చయమే కాని ప్రజలందరు స్వరాజ్యవాదులకు సహాయము చేయుటలేదు. అందువల్ల స్వరాజ్యపార్టీ వారి బలం రెంటికిచెడిన రేవడిలా ఉన్నది. కాంగ్రెసు తమ చేతులలో లేదని ప్రజాదరణం చూరగొన్న నిరాకరణవాదులు, గడ్డితట్టలో పడుకున్న కుక్కల్లా తాము తినకుండా ఇతరులను తిననీయకుండా చేస్తున్నారు. తాము శాసనసభలకు సభ్యులుగా వచ్చి జాతీయపక్షాన్ని బలపరచి ప్రభుత్వము చేతబూని, ప్రజలకు అనుగుణమైన ప్రభుత్వం చేయడం మంచిదికాదటయ్యా పరమేశ్వరరావుగారూ?

పర: అల్లా ప్రభుత్వం ఒప్పకపోతేనండీ?

జమీం: ఒప్పరూ, ఒప్పకుంటే గవర్నరు శాసనసభను రద్దుచేసి, కొత్త ఎన్నికలు ప్రచురించాలి. అందులో మనవాళ్ళే తిరిగి ఎన్నుకోబడతారు. మళ్ళీ మనవాళ్లే ప్రజలపక్షమై మంత్రులై మరల యుద్ధంచేసి విజయం పొందవచ్చు కాదా?

పర: అప్పుడు గవర్నరుగారు ఒప్పుకోకపోతేనండి?

జమీం: ఈ ప్రభుత్వవిధానం రద్దుచేసి తాను, తన కార్యనిర్వాహక వర్గపు మంత్రులు రాజ్యం చేసుకోనీండి. శాసనసభ వట్టి నాటకం అని ప్రజలకు తెలుస్తుంది.

నారా: అదేనండి, అట్టినాటకము అని గాంధీగారు గ్రహించి, ఆ రోగము మూలానికే తగుచికిత్స చేయవలె నంటున్నారు! టైఫాయిడు జ్వరం వచ్చిన రోగిని డాక్టరొకరు మలేరియా కాదని తెలిసియు, ప్రపంచమునకిది టైఫాయిడు అని నిర్ధారణచేయుటకు క్వయినా యిచ్చి యిచ్చి జ్వరం తగ్గలేదండి అని చూపించి, అప్పుడు టైఫాయిడు అని చికిత్స చేయదలచుకొన్నట్లు వుంటుంది కదాండి. ఈ ఆలస్యంవల్ల రోగికి ప్రాణాపాయంకూడా రావచ్చుకదాండీ?

జమీం: మలేరియా యని నిజంగా అనుకుంటే!

నారా: చిత్తం. అలా అనుకునే, ముప్పదియైదు సంవత్సరములు చికిత్స చేసినారు. ఇంకెంత కాలమండీ?

పర: మనదేశం దివ్యమైనది. నాలుగురోజులు ఆలస్యం చేస్తే ఏమిరా?

నారా: అవును, మన ఆత్మలు ఆద్యంతరహితములు. వైద్యమెందుకు?