తీవ్రమైన చర్య తీసుకుంటున్నానని శ్రీ నారాయణన్ నాకు చెప్పారు. "మీకు "పద్మశ్రీ" అవార్డు వచ్చిందా?" అని ఆయన అడిగారు. లేదు. 13 సంవత్సరాల నుంచి పెండింగ్లో వుందని చెప్పాను. రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాతో పాటు తీసుకువెళ్లిన "పద్మశ్రీ"కి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆయనకు చూపించాను. ఆయన వాటిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు!
నాకు ఆయన చేతుల మీదుగా ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో 2002 మార్చిలో "పద్మశ్రీ" అవార్డు ప్రదానం చేసిన తరువాత కేంద్రమంతివర్గం కార్యదర్శి శ్రీ టి.ఆర్. ప్రసాద్ రాష్ట్రపతికి నన్ను పరిచయం చేస్తూ "శ్రీ తుర్లపాటి ప్రఖ్యాత పాత్రికేయుడు. తెలుగు పాత్రికేయులలో మొట్ట మొదటి "పద్మశ్రీ" అవార్డు గ్రహీత" అని పేర్కొన్నారు. గతంలో జరిగిన "లెమాండ్" ఉదంతం, "ఆంధ్రకేసరి" డాక్యుమెంటరీ విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నారు కాబోలు, "తుర్లపాటి ప్రసిద్ధ పాత్రికేయుడేకాడు, ఆయనలో ఇతర ప్రజ్ఞా విశేషాలు చాలా వున్నాయి" అని రాష్ట్రపతి నారాయణన్ వ్యాఖ్యానించారు!
అక్కడే వున్న ఉపరాష్ట్రపతి శ్రీ కృష్ణకాంత్తో "నేను రాసిన ప్రఖ్యాత పార్లమెంటేరియన్ శ్రీ తెన్నేటి విశ్వనాథం జీవిత చరిత్రను విశాఖపట్నంలో మీరు ఆవిష్కరించా"రని జ్ఞాపకం చేయగా, "ఆయనెక్కడ? మహామహుడు! అలాంటి వారు ఇప్పుడెక్కడ వున్నారు? అని వ్యాఖ్యానించారు!
చంద్రబాబు - చిరంజీవి
1998 అక్టోబర్ 2వ తేదీన అప్పటి మెగా స్టార్ చిరంజీవి హైదరాబాద్లో "బ్లడ్ బ్యాంక్"ని ప్రారంభించారు. దాని ప్రారంభోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఇంకా హోమ్ మంత్రి శ్రీ ఎ. మాధవరెడ్డి, ప్రసిద్ధ నటుడు శ్రీ మురళీమోహన్, ప్రముఖ నేత్రవైద్యుడు డాక్టర్ శివారెడ్డి ప్రభృతులు హాజరైనారు. నన్ను సభాధ్యక్షుడుగా శ్రీ చిరంజీవి