122
మీఁగడ తఱకలు
మనుచరిత్రను దెలుఁగురసికు లందఱుఁ జదువుచునే యుందురు. నాల్గాశ్వాసముల దాఁకనే, నూటికిఁ బదిమందియైనను దరువాత కథను జదువరు. చదివినను వరూధినీగంధర్వసమాగమము మరల నెక్కడ నయినను రాఁగల దేమో చూత మనునాశతోఁ జదువుచుందురు.
పయి విషయములే గాక, పెద్దన్న కవిత్వరచననుగూర్చి చెప్పిన యుత్పలమాలిక, కృష్ణరాయనిర్యాణానంతరము చెప్పిన సీసపద్యములు రెండు, మఱికొన్ని పెద్దన చాటుపద్యములు నాంధ్రసారస్వత మున్నంతదాఁక నిలిచి యుండఁగలవు.
పెద్దన్న సీసపద్యము నొకటిమాత్ర మిచ్చటఁ జదివి యాయన ఘనతను స్మరింపుఁడు-
సీ|| ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి
కేలూత యొసఁగి యెక్కించుకొనియె
బిరుదైనకవిగండపెండేరమునఁ కీవె
తగు దని తానె పాదమునఁ దొడిగె
మనుచరిత్రం బందుకొనువేళఁ బుర మేఁగఁ
బల్లకిఁ దన కేలఁ బట్టి యెత్తె
కోకటగ్రామా ద్యనేకాగ్రహారంబు
లడిగినసీమలయందు నిచ్చె
గీ|| నాంధ్రకవితాపితామహ యల్లసాని
పెద్దనకవీంద్ర యని నన్నుఁ బిలుచునట్టి
కృష్ణరాయలతో దివి కేఁగఁ లేక
బ్రతికి యున్నాఁడ జీవచ్చవంబ నగుచు.
- * *