ప్రస్తుతం జయంతి సందర్భంగా ముద్రిస్తున్న పుస్తకాలు, శ్రీశాస్త్రిగారు ఆయా సందర్భాల్లో గావించిన ఉపన్యాసాలూ, సమర్పించిన పత్రాలూ ఒకచోట చేర్చి - అనేకాంశాలపై నున్న వ్యాసాలు. ఇందులో ఆంధ్రసాహిత్యం సారభూతంగా ఆణిముత్యాల్లాంటి శీర్షికల్తో - సాహితీ ప్రియులకు హృదయానందాన్నీ నూతన ఆలోచనలనూ, విమర్శనధోరణినీ - త్రివేణీ సంగమంలాగా - నింపుతుంది.
ఈ వ్యాసాల్లో శాస్త్రిగారి సంగీత, సాహిత్య, వేదాంత, భాషాశాస్త్రాది బహుముఖీనమైన ప్రజ్ఞావైశిష్ట్యం సర్వత్ర గోచరిస్తుంది. శాస్త్రిగారు కొన్ని గ్రంథాల్లో స్వయంగా రాసుకున్న “చిత్తు వ్రాతలు" పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తాయి.
అన్నమయ్య కీర్తనలను వెలుగుకు తేవడంలో శ్రీశాస్త్రిగారి కృషి ప్రశంసనీయం!
శ్రీశాస్త్రిగారి వాఙ్మయపీఠాన్ని నెలకొల్పి, అందుకు తగిన సంపూర్ణసహకారం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు గౌరవశ్రీభూమన కరుణాకరరెడ్డిగారికీ, గౌరవ పాలకమండలి సభ్యులకూ, కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ కె.వి.రమణాచారి, ఐ.ఏ.ఎస్.గారికీ, ఇతర అధికారబృందానికీ, శ్రీశాస్త్రిగారి గ్రంథాలయాన్ని పీఠానికి సమర్పించిన శ్రీశాస్త్రిగారికుమారుడు ఆచార్యవేటూరి ఆనందమూర్తి గారికీ, శ్వేత, కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధనసంస్థ తరఫున ధన్యవాదా లర్పిస్తున్నాను.
సాహితీప్రియుల ఆదర ప్రోత్సాహాలతో ఈ వాఙ్మయపీఠం ఇతోధికంగా సాహితీసేవలో ధన్యమవుతుం దని ఆకాంక్షిస్తున్నాను.
ముద్రణ విషయంలో డి.టి.పి. చేసి యిచ్చిన 'యూనివర్సిటీ జెరాక్స్' వారికీ, సకాలంలో ముద్రించియిచ్చిన తి.తి.దే. ముద్రాణాలయం వారికీ, ముద్రణ విషయంలో నిరంతరం శ్రమించిన - వాఙ్మయ పీఠం సమన్వయకర్త డా|| పి. చెంచుసుబ్బయ్య గారికీ ధన్యవాదాలు.
- భూమన్