పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజా సర్ మాధవరావు

299



ఘటించిన సరదారులను మాధవరావు బలిమిం బట్టించి కాశీ మొదలగు పట్టణములకు బంపించి దేశమునిష్కంటకము చేసెను. అంతతో సరదారుల బాధ కొంతవఱకుఁ దొలఁగెను. ఇదిగాక మాధవరా వెక్కవలసిన కష్టపుగట్టు మరొకటి యుండెను. అది సైన్య సంబంధమైనది. సంస్థానములో నిరర్థకముగ గొంతసేన యుండెను. ఈసేనకగు కర్చు లెక్కువ వారివలనగు పనితక్కువ. పనులటుండగా సైనికు లాయుధపాణులై యెక్కడిబోయిన నక్కడజనులను బలు బాములఁ బెట్టుచుండిరి. మాధవరావు వ్యర్థమగు సైన్య వ్యయము తగ్గింపఁదలఁచి యా పటాలమును విడగొట్టి సేనాపతులకుఁ దక్కిన సైనికులకు సంస్థానములో నితరోద్యోగములిచ్చెను. ఇవియే గాక మాధవరావు మఱియు ననేక కార్యములు చేసెను. ప్రజలకు భారముగ నుండు పన్నులు తీసివేసెను. పాఠశాలలుస్థాపించెను. కోర్టులు పెట్టించెను. మురికి సందులలోనున్న యిండ్లు పడగొట్టించి వీధులు వెడల్పు చేయించి మంచి యిండ్లు గట్టించెను. పట్టణమున కలంకారములుగ నుండు గొప్పమేడలు భవనములు గట్టించెను. సంస్థానములో గొప్ప యుద్యోగమునకుఁ దగిన సమర్థులు లేనందున మాధవరావు సమర్థులను బొంబాయినుండి చెన్న పట్టణమునుండి పిలిపించెను. ప్రజలకు భారము లేకుండగనే శిస్తులు మునుపటికంటె హెచ్చెను. సమర్థులు దొరకుటకును దొరకినవారికి లంచముల మీఁదికి బుద్ధి పోకుండుటకును మాధవరా వుద్యోగస్థుల జీతములు హెచ్చించి ప్రతిమాసము నందు సరిగా నిప్పించుచు వచ్చెను. ఈయన మంత్రిగానున్నపుడె ప్రస్తుతము హిందూదేశ చక్రవర్తిగానున్న ఎడ్వర్డురాజుగారు యువరాజుగానుండి హిందూస్థానము సందర్శింపవచ్చి బరోడాకుఁ బోయి మాధవరావుచేత సత్కృతుఁడై చాల సంతసించెను.

అతఁడెన్ని మార్పుల జేసినను మునుపటివాని నాధారముగా నుంచుకొనియే చేసెను. కాని వెనుకటివన్నియు నిర్మూలించి క్రొత్త