పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

149

మను నాలుగుభాషలలో ననర్గళధారగ మాటలాడఁగల సామర్థ్యము గలవాఁడు. ఏవిషయమును బ్రసంగించు నపుడైనఁ బ్రమాణములు వందలకొలఁది యతఁడు చూప శక్తిగలవాఁడు. వేయేల ! నాలుగు వేదములు వానికి వశములై యుండెనని లోకులు చెప్పుకొనిరి. ఆతఁడు కలకత్తాలో నున్న కాలమున కేశవచంద్రసేనుడు వానిని సందర్శించి మైత్రిచేసి వేదాంతవిషయము లనేకములు వానితోఁ జర్చించి క్రొత్త సంగతులు నేర్చికొనియెను. ఈగెలుపు లన్నిఁటినిగూర్చి యానాటి వార్తాపత్రికలే స్వామిని వేయినోళ్ళం బొగడుచు వ్రాసినవి. స్వామి కలకత్తానగరము విడిచి ప్రయాగ కాన్పూరు మొదలగు పట్టణములఁకుబోయి తనసిద్ధాంతము బోధించి కొంతకాల మాప్రాంతమున గడపి బొంబాయి నగరవాసులు తన్ను రమ్మని ప్రార్థింప 1874 వ సంవత్సరమున నచ్చటి కరిగెను.

బొంబాయి నగరవాసులు స్వామిని తద్దయు నాదరించి వాని యుపన్యాసములఁగడుశ్రద్ధతోవినిరి. దయానందుఁడాపట్టణమున దేవాలయ ధర్మకర్తలగు షోక్లీ గోసాయినులతో విగ్రహార్చనమును గురించి వాదించి యోడించి యచ్చట నార్యసమాజము స్థాపించి మరల నుత్తరహిందూస్థానమునకుం జనియెను. త్రోవలో నతని వద్దకు చంద్రపుర గ్రామవాసి యగు మునిషీపైరులాలను నతడు వచ్చి హిందూక్రైస్తవ మహమ్మదీయ మతములలో దేనియందు సత్యము గలదో తెలిసికొనుట కాయా మతస్థులచేత నుపన్యాసము లిప్పింప వలయునని తాను కోరుచుంటిననియు మహమ్మదీయ క్రైస్తవమతస్థు లుపన్యసింప నంగీకరించిరనియు హిందూమత పక్షమున విజయంచేసి యుపన్యసింప వలసినదనియు స్వామినిగోరెను. స్వామి దానికంగీకరించి యాగ్రామమునకుఁ బోయి మూడుదినములు వారితో వాదించి హిందూమత పక్షమున నుపన్యాసములిచ్చి క్రైస్తవులకు మహమ్మదీయు