పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

మహాపురుషుల జీవితములు

పండితులతో వాదించి వాదము నిలఁబెట్టుకొమ్మని దయానందునకు వర్తమానమంపిరి. వాదనల కెప్పుడును దయానందుఁడు వెనుకదీయువాఁడు గాఁడు గావున తానందుకు సిద్ధముగా నుంటినని ప్రత్యుత్తర మంపెను. ఆసంవత్సరము 16 వ నవంబరున నొకమహాసభజరిగెను. దాని కిరువది వేలమందికంటె నెక్కువ జనులు వచ్చిరి. జగత్ప్రసిద్ధులగు విశుద్ధానందుఁడు బాలశాస్త్రి మొదలగు దిగ్గజములవంటి పండితులనేకు లాసభకు వచ్చిరి. దయానందసరస్వతి యాయందఱ పండితులకు నోళ్ళాడకుండునటులు నాలుగు వేదములలో నుండియుఁ దనవాదమున కుపవనముగ ననేకప్రమాణములఁజూపి సభవారిని దిగ్భ్రాంతులఁజేసెను. శివప్రసాదు తెల్లఁబోయెను. పండితులు మొగ మొగంబులు చూచుకొనిరి. ఆవాదమున దయానందస్వామి సంపూర్ణముగఁ గాశీవిద్వాంసుల నోడించెను. ఆ విజయమునుగూర్చి హిందూ పేట్రియాటుపత్రిక వ్రాయుచు దయానందుని ప్రజ్ఞాదికములను జాల వర్ణించెను.

అనంతరము 1870 వ సంవత్సరము జనవరి నెలలోఁ గొందఱు పెద్దమనుష్యుల ప్రార్థనమున దయానందస్వామి కలకత్తా నగరమునకుఁ బోయెను. మతవిషయములను దనతో వాదింప నిచ్చలగలవారువచ్చి వాదింపుడని పిలుచుచు నితఁడు జాబు లచ్చు వేయించి పండితులకుఁ బంపెను. ఆపత్రికలఁ జూచుకొని యచ్చటిపండితులు వానితో మత విషయములో ననేక వాదములుచేసి యోడిపోయిరి. పండితుల నోడించి దయానందుఁడు కలకత్తాలోఁ బెద్ద సభ చేసి సాయంకాలము మూఁడుగంటలు మొద లాఱుగంటలవఱకు సంస్కృతభాషలో నుపన్యసించి జనులను మహానందసముద్రములో ముంచెను. సంస్కృతము వినిన వానినోటినుండియే వినవలయునని యచ్చటి పండితు లందఱైక కంఠ్యముగఁ బలికిరఁట. ఆయన హిందీ మరాతీ గుజరాతీ సంస్కృత