అప్పుడు సర్కారు ఉద్యోగులుగా నుండువారును, ప్రజలలో మరికొందరు ప్రముఖులును మోకాళ్ళవరకు సాగు పొడవు చొక్కాలు, షేర్వాణీలు లేక అంగర్ఖాలను పేరుగలవి తొడుగుకొనుచుండువారు. తలగుడ్డలు వంకరగా చుట్టుకొని, వీపున తోకవలె కొంగులు జారవిడుచుచుండెడివారు. కొందరి ఇండ్లలో పట్టాకత్తులును, బాకులు, బల్లెములుగూడ నుండెడివి.
'పార్షి' అను పేరుతో ఉర్దూభాష నా కాలమున నేర్పుచుండిరి. ఇంక నెప్పటికైన మరల మొగలాయి రాజ్యములో మనదేశము చేరునను భ్రమచే తమ పిల్లలకు హిందువులు గూడ 'పార్షి' నేర్పించెడివారు కావున పార్షిభాషా పండితులు గూడ మనవారిలో నుండెడివారు.
ఆ కాలమున వేసవియెండలు మిక్కిలి తీవ్రముగ నుండెడివి. రాత్రివేళలో సయితము వేడిగాడ్పులి వీచుచుండెను. వర్షములును అధికముగ కురియుచు భూములు బీళ్ళువడి దున్నుటకు దుస్సాధములుగ నుండెను. పంటలు చాల తక్కువ. ఈ ప్రాంతమంతటను మెట్టసాగే సాగుచుండెను. మాగాణి అప్పుడప్పుడె యరుదుగ ప్రారంభమయ్యెను.
జొన్న, సజ్జ, వరిగె, మొక్కజొన్న మొదలగు మెట్ట పంటలు పండుచుండెడివి. జనులు సాధారణముగ తాము పండించుకొను ధాన్యమునే తినుచుండెడివారు. బ్రాహ్మణులు సయితము పలువురు జొన్నన్నము, వరిగన్నము తినుచుండెడివారు. కొంత