వారు గట్టిగా చెప్పిరనియు, గావున నింతట సమ్మె చాలించి బడికి పోవుట మంచిదనియు లేకున్న చదువుకు భంగముకలుగునుగాన విద్యార్థులకే నష్టమనియు ఎంతవారైననను ఒకప్పుడు తప్పులు చేయుదురు గనుక వారిపై కాఠిన్యము వహించుట సరికాదనియు, ఎట్లయిన వారు విద్యాగురువులు మీరు విద్యార్థు లను విషయము మరువవలదనియు శాంతముగా మాకు నచ్చజెప్పుటతో మేము సమ్మెమానుటకు నిశ్చయించుకొంటిమి.
ఆనాడు మా బి. ఏ. సీనియర్క్లాసుకు ఏదో పరీక్ష ప్రారంభముకాబట్టి మేము పెద్దహాలులో కూరుచుండి పరీక్షా ప్రశ్నలను చదువుకొనుచుండగనే అప్పుడప్పుడె అచ్చువేసిన చినకరపత్రమొకటి మాలో పదుగురకు అందిచ్చిరి. అందు "నీవు సమ్మెకు ప్రధాననాయకులలో నొకడవుగా నున్నట్లు మాకు స్పష్టమైనది గనుక పదిరూపాయలు జరిమానావిధించబడినది. ఈజరిమానా చెల్లించనియెడల నిన్నుగురించి విశ్వవిద్యాలయాధికారులకు తెలిపి పరీక్షలలో చేర్చుకొనకుండ నిషేధపుటుత్తరువు తెప్పించబడు"నని వ్రాయబడియుండెను. దీనినిబట్టి కష్టసుఖముల నాలోచించుకొంటిమి. అప్పుడు క్లాసులోజరుగు పరీక్షకు గూడ హాజరగుటకు అవకాశము లేదనిరి. మాలో గురుస్వామి, రామచంద్రన్ అనువా రిర్వురుమాత్రము సంస్కృతవిద్యార్థులగుటచేత వారు కలకత్తాలో చదువ నిశ్చయించుకొని జరిమానా చెల్లించలేదు. నేను, హనుమంతరావును తెలుగువిద్యార్థులము. బి. ఏ. పరీక్షలో తెలుగు మాకు రెండవభాష, తెలుగులోనే పరీక్ష ఇయ్యవలసియున్నది. మరి యే యితరవిశ్వవిద్యాలయ