పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కథలు - గాథలు

వ్యవహారం విషయంలో ఆయనకు చాలా అనుమానం కలిగింది. గాని ఈలోపుగా తన అర్జీలు కంపెనీవారు చిత్తగించి న్యాయం చేస్తారనే ఆశపోయి నరసింహా అప్పారావుగారికి మనసు విరిగిపోయినది. అందువల్ల 1783 లో కొంతసైన్యం సమకూర్చుకొని కోటలో కూర్చుని తిరుగుబాటుచేశారు. అంతట కంపెనీవారు ఆయనపైకి సైన్యాన్ని పంపారు. ఆయన నిజాము సరిహద్దుదాటి పారిపోయి సైన్యాలు కూర్చుకుని నూజివీడుమీదికి దండయాత్రలు చేయడం ప్రారంభించాడు.

ఆయనను పట్టుకోవడానికి కంపినీవారు నిజాంప్రభుత్వముతో వుత్తరప్రత్త్యుత్తరాలు జరుపుతూవుండగా అప్పారావుగారు తన తిరుగుబాటును క్షమిస్తే బకాయి చెల్లిస్తానని కంపినీఅధికారులతో రాజీచేసుకొని మొదటికిస్తీ చెల్లించగా జమీందారీని ఆయన వశంచేశారు. రెండవకిస్తీ చెల్లించలేకపోయి మళ్లీ తిరుగుబాటు చేసి మారువేషంతో పారిపోయాడు. కంపినీవారు కోటబురుజులను భూమిమట్టం చేశారు. ఈ నరసింహ అప్పారావుగారికి జమీందారీ హక్కు తీసివేశామనిన్నీ ఆయన కుమారుడు వెంకటనరసింహ అప్పారావుగార్ని జమీందారుగ స్థిరపరిచామనిన్నీ కంపినీవారు 1784 లో ప్రకటించారు.

నరసింహ అప్పారావుగారు భద్రాచలం అడవులలో తిష్ఠవేసుకొని సైన్యంతో వచ్చిపడి గ్రామాలు కొల్లబెడుతూ ఇళ్ళు తగల పెడుతూ ఖజానా దోచుకుంటూ అడ్దువచ్చినవారిని నరికి దౌర్జన్యాలు చేయడం ప్రారంభించాడు. కంపెనీ అధికారులు ఈపోరు పడలేక చివరికి విసిగివేసరి ఏమీచేయలేక నరసింహ అప్పారావుగారు కొమారుని దగ్గర నూజివీడులోనే వుండడానికి రాజీగా అంగీకరించారు. కొమారుడు సమర్ధుడు కానందువల్ల తండ్రి పలుకుబడి హెచ్చుగా వుండేది. ఆఖరికి నరసింహ అప్పారావుగారిని బందరుకు రప్పించి అక్కడ ఖైదు చేశారు. ఆయనతోవచ్చిన పరివారము నూజివీడుకు పోయి చిన్న జమీందారుగారికి లొంగక, దౌర్జన్యాలు చేస్తూ చినరాణీగారి కొమారుడికి మద్దతు చేయడం ప్రారంభించారు.

బందరులో కొన్నాళ్లు అధికారిగా వుండిన ఫ్లాయరు లంచము